జానూ... ఎక్క‌డున్నావ‌మ్మా..!

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా తుని మండ‌లం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్య‌మైన రెండేళ్ల చిన్నారి జాహ్న‌వి ఆదివారం నాటికి తొమ్మిది రోజులైనా జాడ దొర‌క‌లేదు.. క‌ళ్ల‌ముందు అడుకునే ప‌సిపాప ఏమైందో తెలియ‌క క‌న్న‌వారు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.....

జానూ... ఎక్క‌డున్నావ‌మ్మా..!
X

దిశ‌, కోన‌సీమ ప్ర‌తినిధి: కాకినాడ జిల్లా తుని మండ‌లం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్య‌మైన రెండేళ్ల చిన్నారి జాహ్న‌వి ఆదివారం నాటికి తొమ్మిది రోజులైనా జాడ దొర‌క‌లేదు.. క‌ళ్ల‌ముందు అడుకునే ప‌సిపాప ఏమైందో తెలియ‌క క‌న్న‌వారు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.. మ‌రో ప‌క్క పోలీసులు త‌మ ద‌ర్యాప్తును మ‌రింత ముమ్మ‌రం చేశారు.. అనుమాన‌మున్న ప్ర‌తీ కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తూ చిన్నారి జాహ్న‌వి ఆచూకీ క‌నిపెట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.. చిన్నారిని ఎవ్వ‌రైనా కిడ్నాప్ చేశారా.. లేక అట‌వీప్రాంతంలో ఏ అడ‌వి జంతువుల వ‌ల్ల హాని జ‌రిగిందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.. కానీ కేసులో ఎటువంటి ఆధారాలు ల‌భ్యంకాని ప‌రిస్థితి త‌లెత్తుతోంది.. దొండ‌వాక పంచాయతీ ప‌రిధిలోని సీహెచ్ అగ్ర‌హారంలో పామాయిల్‌, జీడిమామిడి తోట‌ల‌తో నిండి ఉన్న ప్రాంతంలో కాప‌లాదారునిగా ఉంటూ చిన్నారి త‌ల్లితండ్రులు సుంక‌ర గ‌ణేష్‌, భ‌వానీ దంప‌తులు జీవ‌నం సాగిస్తున్నారు. 26 వ తేదీ శ‌నివారం ఉదయం 11 గంట‌ల స‌మ‌యంలో తండ్రి వెనుకే వెళ్లిన చిన్నారి అదృశ్యం అయ్యింది. ఆ స‌మ‌యంలో చిన్నారిని గ‌మ‌నించ‌ని తండ్రి గ‌ణేష్ పాప త‌న‌వెంట రావ‌డం గ‌మ‌నించ‌లేదు.. పాప వెనుకే వెళ్లిన‌ పెంపుడు శున‌కం నాలుగు రోజుల త‌రువాత అంటే మంగ‌ళ‌వారం ఒంట‌రిగా తిరిగి వ‌చ్చింది..అక్క‌డున్న జ‌నం చూసిన శునకం అక్క‌డి నుంచి మ‌ళ్లీ తోట‌ల్లోకి వెళ్లిపోయి బుధ‌వారం మ‌ళ్లీ వ‌చ్చి చిన్నారి త‌ల్లి భ‌వానిపై దాడి చేసి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నంచింది.. అయితే అర్ధ‌రాత్రి కుక్క‌ను సుర‌క్షితంగా బంధించి 12న దాని మెడ‌కు జీపీఎస్ ట్రాక‌ర్‌ను అమ‌ర్చి దాని క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేశారు.. అయితే అది అనూహ్యంగా 13న మ‌ర‌ణించింది..

శున‌కానికి పోస్ట్ మార్టం..

చిన్నారి జ్ఞానేశ్వ‌రి అదృశ్యం కేసుకు సంబందించి కీల‌క ఆధారంగా ఉన్న పెంపుడు శున‌కం శ‌నివారం ఆక‌స్మికంగా మృతిచెంద‌డంతో కొత్త అనుమానాల‌కు తావిస్తోంది.. అస‌లు కుక్క ఎలా చ‌నిపోయింది అన్న కోణంలో కూడా పోలీసులు దృష్టిసారించారు.. అస‌లు కుక్క ఎలా చ‌నిపోయింది..? ఏమైనా విష‌ప్ర‌యోగం జ‌రిగిందా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేసేందుకు ప‌శువైద్యాధికారుల‌చేత పోస్ట్ మార్టం నిర్వ‌హించారు. తుని మండ‌లం ఎన్‌.సుర‌వ‌రంలో ఉన్న ప‌శువైద్య‌శాల‌లో అసిస్టెంట్ వెట‌ర్న‌రీ స‌ర్జ‌న్‌ మోహ‌న్ వంశీ ఆధ్వ‌ర్యంలో పోస్ట్ మార్టం నిర్వ‌హించ‌గా శున‌కం శ‌రీర భాగాల‌ను విశాఖ‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు..

డిప్యూటీ సీఎం ఆదేశాల‌తో ప్ర‌త్యేక బృందాలు..

చిన్నారి జాహ్న‌వి కోసం ఇప్ప‌టికే పోలీసులు సుమారు 150 మంది వ‌ర‌కు ప‌ది బృందాలుగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోం మినిస్ట‌ర్ అనిత‌ల ఆదేశాల‌తో ఎన్డీఆర్ ఎఫ్‌, ఎన్డీఆర్ ఎఫ్ చెరో నాలుగు బృందాలు ఎంట‌ర్ అయ్యి గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. మ‌రో ప‌క్క అట‌వీశాఖ అధికారులు హ‌నుమాన్ బృందాలు, ర్యాపిడ్ బృందాలు రంగంలోకి దిగాయి.. అత్యాధునిక థ‌ర్మ‌ల్ డ్రోన్ల సాయంతో కొండ‌ప్రాంతంలో ఉన్న‌ అట‌వీ ప్రాంతాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నారు. స్థానికులు కూడా త‌మ స‌హాయ స‌హ‌కారాన్ని అందిస్తున్నారు.. బాలిక అదృశ్యం అయిన ప‌రిస‌ర ప్రాంతాల్లో సెల్ ఫోన్ డాటా ఆధారంగా న‌లుగురు అనుమానిత వ్య‌క్తుల‌ను గుర్తించారు పోలీసులు.. మొత్తం మీద చిన్నారి జాహ్న‌వి అదృశ్యం వ్య‌వహారం తీవ్ర ఉత్కంఠ రేపుతుండ‌గా చిన్నారి క్షేమంగా తిరిగి రావాల‌న్న ఆకాంక్షతో అంతా ఎదురు చూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది..

Next Story