ఏపీలో న్యూ ఇయర్ జోష్.. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్

by Malleboina Mahesh |

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

ఏపీలో న్యూ ఇయర్ జోష్.. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AndhraPradesh Govt) మద్యం ప్రియులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 31 (బుధవారం), జనవరి 1 (గురువారం) తేదీల్లో రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే, బార్లు, క్లబ్బులలో మద్యం సరఫరాను అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణ సమయం కంటే అదనంగా రెండు గంటల పాటు విక్రయాలకు వెసులుబాటు కల్పించడం తో వేడుకల ఉత్సాహం మరింత పెరగనుంది.

అయితే, ఈ సమయం పొడిగింపు కేవలం నిర్ణీత రెండు రోజులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్, ఎక్సైజ్ శాఖలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా 'డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీలను ముమ్మరం చేయాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యాటక ప్రాంతాలు , ప్రధాన నగరాల్లో అదనపు బలగాలను మోహరించి, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Next Story