AP Political News: ఎన్నికల గీత దాటిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్

by Disha Web Desk 3 |
AP Political News: ఎన్నికల గీత దాటిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార పార్టీ నాయకులు వాటిని తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ, వెంకునాయుడుపేట, వైసీపీ నాయకుని ఇంట్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్, వాలంటీర్లతో గుట్టు చప్పుడు కాకుండా సమావేశం నిర్వహించారు.

వాలంటీర్లకు తాయిలాలు పంపిణీతో పాటు ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై సూచనలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టు సమాచారం. కాగా ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. కాగా టీడీపీ నాయకులు లోపలకు రాకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీనితో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు గోడలు దూకి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. మరికొంత మంది అక్కడే ఉన్న ఫ్లాట్లలోనే ఉండిపోయారు. ఇక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ అక్కడి నుంచి కారులో నెమ్మదిగా జారుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై టీడీపీ నాయకులు అధికారులకు పిర్యాదు చేశారు.

ఇక టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తనికీలు చేశారు. చివరికి లోపల ఎవ్వరూ లేరని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో అధికారుల మాటలు నమ్మని కొంతమంది టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించిన ఇంటి ముందే బైఠాయించి, ఆందోళనకు దిగారు. దీనితో పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని గుర్తించిన ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్, నోడల్ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించిన ఫ్లాట్లలో మరోమారు సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఒక గదిలో ఉన్న 15 మంది వాలంటీర్లను గుర్తించారు. కాగా ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారి జయరాం మాట్లాడుతూ అనుమతి లేకుండా వాలంటీర్లతో సమావేశం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. అదేవిధంగా వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సి ఉన్నా, సమావేశంలో పాల్గొన్నందుకు గాను వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ఒక ఉద్యోగిని, ఐదుగురు వాలంటీర్లను, ఒక పూజారిని తొలగించినట్టు పేర్కొన్నారు. అలానే డీఎస్పీ మోహనరావు మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎన్నికల సమావేశం నిర్వహించిన ఇంటి యజమానితో పాటు వాలంటీర్లపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.

దీంతో పాటు సమావేశం నిర్వహించిన ఇంటి యాజమాని ఇచ్చిన పిర్యాదు మేరకు ఆరుగురు టీడీపీ నాయకులపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశామన్నారు. కాగా ఈ ఘటన గురించి 22వ వార్డు టీడీపీ ఇన్చార్జీ చింటూ మాట్లాడుతూ కేవలం తెలుగుదేశంపై దుష్ప్రచారం చేయడం, ఎన్నికల్లో నగదు పంపిణీపై వాలంటీర్లకు సూచనలు చేసేందుకే ఎమ్మెల్యే గణేష్ సమావేశం నిర్వహించారని ఆరోపించారు. అయితే వాలంటీర్లు పట్టుబడగా, నగదు కనిపించలేదన్నారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చింటూ కోరారు.

Next Story

Most Viewed