నారా లోకేశ్ దూకుడు : అనునిత్యం ప్రజల్లోనే..త్వరలో యువగళం పాదయాత్ర

by Seetharam |
నారా లోకేశ్ దూకుడు : అనునిత్యం ప్రజల్లోనే..త్వరలో యువగళం పాదయాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో నారా లోకేశ్ దూకుడు పెంచనున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత టీడీపీలో స్తబ్ధత నెలకొనడంతో దాన్ని అధిగమించేందుకు రెడీ అవుతున్నారా? చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక స్పీడ్ పెంచాలని యువనేత ఓ నిర్ణయానికి వచ్చారా? తండ్రి అరెస్ట్‌తో మధ్యలో ఆపేసిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న మెున్నటి వరకు టీడీపీలో స్తబ్ధత నెలకొంది. ఒకవైపు తండ్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్ కోసం ఇంకోవైపు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్‌ వేశారు. అయితే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఇకపై రెట్టింపు ఉత్సాహంతో లోకేశ్ యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్యాడర్ సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఇకపై ప్రజల్లోనే టీడీపీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రాకపోవడంతో ఆ పార్టీలో కాస్త నిస్తేజం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ కార్యక్రమాలన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. కేవలం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసనలు, ఆందోళనలకు మాత్రమే పరిమితమైంది టీడీపీ. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ ఒకవైపు తండ్రి కేసులు మరోవైపు పార్టీ వ్యవహారాలతో తలమునకలయ్యారు. దీంతో లోకేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర సైతం మధ్యలో నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ వరుస పరిణామాలతో టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లడంలో కాస్త ఆలస్యం అయ్యింది. ఇన్నాళ్లు ప్రజలకు దూరంగా ఉండటంతో ఇకపై అలాంటి గ్యాప్ రాకూడదని ఇకపై అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని టీడీపీ భావిస్తోంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం.. మిగిలిన ఐదు కేసుల్లో కూడా ఉపశమనం లభిస్తోందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా యువతనే నారా లోకేశ్ తిరిగి యువగళం పాదయాత్రను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

యువగళం పాదయాత్ర పున: ప్రారంభం

రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇక నాయకులంతా ప్రజల్లో వుండేలా టీడీపీ కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 24 నుండి లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభమవుతున్నట్లు టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇందుకోసం పార్టీ క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో నిలిచిపోయిన ప్రాంతం నుంచే యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది. త్వరలోనే లోకేశ్ పాదయాత్రకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

తండ్రి సెంటిమెంట్ కొనసాగింపు

ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. రాయలసీమలో ముగిసింది. కోస్తాంధ్రలో అడుగు పెట్టింది. ప్రస్తుతం డా.బి.ఆర్ అంబేద్కర్ జిల్లాలో నిలిచిపోయింది. అయితే వాస్తవానికి పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ పాదయాత్ర విశాఖపట్నంలోనే ముగించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు లోకేశ్‌ సైతం విశాఖలోనే యువగళం పాదయాత్రను ముగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed