నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు

by Anil Sikha |
నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : తన ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దివంగత కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని అని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న ఎర్రన్నాయుడు సేవలను స్మరించుకుందామని ఎక్స్​లో పోస్టు చేశారు.

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోని ప్రజా నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు అని మంత్రి నారా లోకేశ్​ పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై ఆయన స్పందించే విధానం, అనేక క్లిష్టమైన సమస్యలపై పోరాటం నేటి తరానికి ఆదర్శనీయం అని అన్నారు. రాష్ట్రానికి, తనని నమ్ముకున్న ప్రజలకి న్యాయం చెయ్యాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదంటూ ఢిల్లీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను పెంచిన మహోన్నత వ్యక్తి కింజరాపు ఎర్రంనాయుడు సేవలు ఎనలేనివని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎర్రం నాయుడు 68వ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇటు ప్రజలకి మరువలేని నాయకత్వం అందించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు తమకు మార్గదర్శకమని రామ్మోహన్​నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్నటికీ ఈ తెలుగు గడ్డ మరువని నాయకుడు ఎర్రంనాయుడు అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed