AP Elections 2024: ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ వెంటే ఉంటా.. ఎంఎస్ బాబు

by Disha Web Desk 3 |
AP Elections 2024: ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ వెంటే ఉంటా.. ఎంఎస్ బాబు
X

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్పులు చేర్పులతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ తీరు పట్ల తమకున్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితా లోకి పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వస్తారు. గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీరు పైన సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు బాబు. ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు వైసీపీ వెంటే ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓ కొడుకు ఇంట్లో తన తండ్రిని ఏ విధంగా అడుగుతాడో తాను అదేవిధంగా అడిగానని.. అయితే ఈ విషయాన్ని మీడియా వక్రీకరించి చూపిస్తూ దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు వైసీపీ కోసమే పని చేస్తానని.. నన్ను పార్టీ నుండి బయటకు పంపేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానుప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదని పేర్కొన్న ఆయన.. తనకు మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఎప్పటికి మరువలేనిదని తెలిపారు. మీడియా సంస్థలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబంలో చిచ్చుపెట్టే విధంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Next Story

Most Viewed