లోకేష్ పై కోడిగుడ్డు విసిరింది టీడీపీ అభిమానులే.. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

by Dishafeatures2 |
లోకేష్ పై కోడిగుడ్డు విసిరింది టీడీపీ అభిమానులే.. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
X

దిశ, కడప: ప్రొద్దుటూరులో నిర్వహించిన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పై గుడ్డు విసిరింది టీడీపీ అభిమానులేనని, లోకేష్ వైసీపీ పై దుష్ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. యువగలం లోకేష్ తో సెల్ఫీలు తీసుకోవాలన్న టిడిపి అభిమాని అయిన పెన్నా నగర్ కు చెందిన బాబుకు అవకాశం దక్కకపోవడంతో ఆగ్రహానికి గురైన అతను లోకేష్ పై కోడిగుడ్డు విసిరినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ శాఖ కూడా మీడియా సమావేశంలో వ్యక్తపరిచారని పేర్కొన్నారు. కోడిగుడ్డు విసిరిన బాబు కు మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్ట మహేష్ కారు డ్రైవర్ వినయ్ కు సొంత బావ అవుతారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన మీడియాకు ప్రదర్శించారు.

పెన్నా నగర్ కు చెందిన బాబు అతని బావ వినయ్ లు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని తెలిపారు. వీటన్నిటిని తెలుసుకోకుండా నారా లోకేష్ స్థానిక వైసీపీ నాయకులపై బురదజల్లి దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. కోడిగుడ్డు టిడిపిదే ఆమ్లెట్ వేసింది టిడిపి అభిమానులకే అని ఎద్దేవా చేశారు. ఇకనైనా నిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కౌన్సిలర్లు వరికూటి ఓబులరెడ్డి, పిట్టా బాలాజీ, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Next Story