రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం.. బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-05 15:10:44  IST  )

రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు...

రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం.. బిగ్ అలర్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు ప్రభావం చూపనున్నాయని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్ర–పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. పిడుగులతో కూడిన వర్షాల సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. అలాగే ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Next Story