వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట : కేంద్రమంత్రి పెమ్మసాని

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-01 07:57:10  IST  )

వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట : కేంద్రమంత్రి పెమ్మసాని
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభలో అమరావతి పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు (అమరావతి చట్టబద్ధత బిల్లు)ను ప్రవేశపెట్టడంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజధానికోసం భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలకు అభినందనలు తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై తనకు మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని పోరాడిన మహిళలకు జేజేలు పలికారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని పెమ్మసాని పేర్కొన్నారు. కానీ.. మధ్యలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. అమరావతి నిర్మాణం చేయకుండా ఐదేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసి, రైతులు మహిళలను అవమానించారన్నారు.

ఆత్మగౌరవానికి ప్రతీక..అమరావతి : సీఎం రమేష్

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. రాజధాని అంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ.. గతంలోనే బీజేపీ తీర్మానం చేసిందన్నారు. ప్రతి తెలుసుగువాడి గుండె చప్పుడు అమరావతి అని, ప్రజా రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతి చట్టబద్ధతకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ సహకరించాలని, వారందరికీ సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని, ఇకపై ఎవరూ రాజధానిపై మూడు ముక్కలాట ఆడలేరన్నారు. అమరావతి అభివృద్ధిచో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, రాబోయే 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story