జయదేవ్ గల్లాకు ఏపీ క్షమాపణ చెప్పాలి: ఎక్స్‌లో మంత్రి నారా లోకేష్

by Vemula.Srinu Prasad |

అమర రాజా సంస్థ చైర్మన్ జయదేవ్ గల్లాకు ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమర రాజా సంస్థ ఎదుర్కొన్న వేధింపులు అస్సలు జరగకూడదని ఆయన అన్నారు....

జయదేవ్ గల్లాకు ఏపీ క్షమాపణ చెప్పాలి: ఎక్స్‌లో మంత్రి నారా లోకేష్
X

దిశ, ఏపీ బ్యూరో: అమర రాజా సంస్థ చైర్మన్ జయదేవ్ గల్లాకు ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమర రాజా సంస్థ ఎదుర్కొన్న వేధింపులు అస్సలు జరగకూడదని ఆయన అన్నారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. నాలుగు దశాబ్దాలకు పైగా అమర రాజా సంస్థ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప విజయగాథగా నిలిచిందని, ప్రపంచ స్థాయి తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని కొనియాడారు.

తన సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం లభించాల్సిందిపోయి, వేధింపులు ఎదురుకావడం బాధాకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన సంస్థ తన తదుపరి విస్తరణ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ మరోసారి పరిశ్రమలు, పెట్టుబడులకు స్వాగతం పలుకుతోందని తెలిపారు. అమర రాజా ప్రస్థానంలో అత్యంత గొప్ప అధ్యాయాలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే రాయబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ద్వారాలు, హృదయాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొంటూ, తెలంగాణలో ఏర్పాటు చేసిన అమర రాజా కొత్త ప్లాంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story