రైతులకు మీరేం చేశారు ? చర్చకు మేం రెడీ : జగన్‌కు మంత్రి నాదెండ్ల సవాల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-16 15:07:50  IST  )

వర్క్ ఫ్రమ్ బెంగళూరులో ఉన్న జగన్ నెలకొకసారి బయటికి వచ్చి పర్యటనల పేరుతో అలజడులు సృష్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.

రైతులకు మీరేం చేశారు ? చర్చకు మేం రెడీ : జగన్‌కు మంత్రి నాదెండ్ల సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: వర్క్ ఫ్రమ్ బెంగళూరులో ఉన్న జగన్ నెలకొకసారి బయటికి వచ్చి పర్యటనల పేరుతో అలజడులు సృష్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యటనల సందర్భంగా ఆయన పోలీసుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని, జగన్ (YS Jagan) వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొవాలని, జగన్ వల్ల ఎంత నష్టం, ఎలాంటి నష్టం జరుగుతుందో గమనించాలని సూచించారు.

అధికారంలో ఉండగా రోడ్లపై గుంతల్ని పూడ్చలేని జగన్.. ఇప్పుడు ఎన్నికల హామీలపై మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి.. నకిలీ బ్రాండ్లతో అనేకమందిని పొట్టన పెట్టుకున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం వైసీపీ (YSRCP) అని విమర్శించారు. సమయం పట్టినా.. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, ప్రజలు తమపై నమ్మకంతోనే గెలిపించారని తెలిపారు. తాము హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తున్న జగన్.. రైతుల కోసం ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

గత పాలనలో రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిల్ని ఎగ్గొట్టి, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి నరకం చూపించారని మంత్రి ఆరోపించారు. కూటమి సర్కార్ ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.12,857 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, రూ.12 వేల కోట్లను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేశామని వివరించారు. మరో వెయ్యికోట్ల రూపాయల్ని 40 రోజుల్లో జమచేశామని, జగన్ ఈ వాస్తవాల్ని గ్రహించి మాట్లాడాలని సూచించారు.

Next Story