బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి లోకేశ్ భేటీ : ఫిలిం సిటీ నిర్మాణంపై కీలక చర్చ

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్‌తో శుక్రవారం ముంబైలో భేటీ అయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి లోకేశ్ భేటీ : ఫిలిం సిటీ నిర్మాణంపై కీలక చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్‌తో శుక్రవారం ముంబైలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి సినిమా షూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దడం, రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.

ఏపీలో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ..

ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక అత్యాధునిక ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని నిర్మించే అంశంపై చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాల చిత్రీకరణకు ఏపీని వేదికగా మార్చడం. సినిమా రంగం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలను మంత్రి వివరించారు. సినిమా షూటింగ్‌ల కోసం అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేస్తామని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నిర్మాతలు, దర్శకులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదిక ద్వారా అనుమతులు పొందేలా సింగిల్ విండో వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల షూటింగ్‌లు వేగవంతంగా జరగడమే కాకుండా, సమయం మరియు వ్యయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

షూటింగ్ హబ్‌గా ఏపీ..

రాష్ట్రంలోని సహజ సిద్ధమైన సముద్ర తీరాలు, కొండ ప్రాంతాలు మరియు చారిత్రక కట్టడాలు సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైనవని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ వనరులను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సినిమా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామన్నారు. ‘లెజెండరీ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఏపీలో కొత్త ఫిలిం సిటీ ఏర్పాటు మరియు సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులపై ఆయనతో చర్చించాను. రాష్ట్రంలో సినిమా రంగానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను (Ecosystem) సృష్టించే దిశగా మా ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది.’ అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు.

Next Story