వారిది ద్వంద్వ వైఖరి.. అందుకే తరిమికొట్టారు: మంత్రి గొట్టిపాటి

by Vemula.Srinu Prasad |

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే ఆ పార్టీ నేతలను అమరావతిలో ప్రజలు తిరస్కరించే పరిస్థితికి దారితీశాయని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు..

వారిది ద్వంద్వ వైఖరి.. అందుకే తరిమికొట్టారు: మంత్రి గొట్టిపాటి
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే ఆ పార్టీ నేతలను అమరావతిలో ప్రజలు తిరస్కరించే పరిస్థితికి దారితీశాయని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. మద్దిపాడు-వెల్లంపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి, ఎన్నికలకు ముందు అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై స్పష్టమైన వైఖరి లేకుండా రోజుకో మాట మాట్లాడటం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకుండా చేయాలన్న ధోరణితోనే వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.

వైసీపీ నేతలను తీవ్రంగా వ్యతిరేకించారు..

అందుకే ఇటీవల అమరావతికి వచ్చిన వైసీపీ నేతలను రాజధాని రైతులు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉన్నప్పటికీ, జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే రాజధాని విషయంలో అనిశ్చితిని ఎదుర్కుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.

Next Story