ఇకపై మీరు ఆహ్వానిస్తేనే చర్చలకు వస్తాం: మంత్రి బొత్స

by Web Desk |
ఇకపై మీరు ఆహ్వానిస్తేనే చర్చలకు వస్తాం: మంత్రి బొత్స
X

దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగ సంఘాలపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ పదేపదే చర్చలకు పిలుస్తోందని ఉద్యోగ సంఘాలు అలుసుగా తీసుకున్నాయనిపిస్తోందని మండిపడ్డారు. ఇటీవల కాలంలో మంత్రుల కమిటీ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత కూడా చర్చలకు రాకపోవడం ఏంటని నిలదీశారు.

గత ఐదు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం మంత్రుల కమిటీ సచివాలయంలో వేచి చూస్తుందని అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు రాకపోవడం సరికాదన్నారు. ఏదైనా సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇకపై ఉద్యోగ సంఘాల కోసం మంత్రుల కమిటీ వేచి చూడదని.. ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తామని చెప్పినప్పుడే చర్చలకు వస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెగేసి చెప్పారు.

ఘర్షణ వాతావరణం మంచిది కాదు

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు అనడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. జీతాలు పడితే కదా.. పెరిగింది తగ్గింది అని తెలిసేదని చెప్పుకొచ్చారు. పే స్లిప్ చూసిన తర్వాత ఉద్యోగ సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా తాము చర్చిస్తాం కదా అని చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికి రూపాయి కూడా జీతం తగ్గదని ప్రభుత్వ పరంగా తాను తెలియజేస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో భాగమని చెప్పుకొచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న తాపత్రయం ప్రభుత్వానికి ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఉద్యోగులు జీతాలు తగ్గిపోతాయనే భ్రమలో ఉన్నారని వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం అవసరమైతే నాలుగు మెట్లు దిగివస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కమిటీని నియమించిందని మీ సమస్యలను చెప్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.


Next Story

Most Viewed