లోకేశ్‌పై అంబటి సెటైర్లు:‘అరగంట కోసం కాదుగా సోం బేరి సారు..’ అంటూ అయ్యన్న కౌంటర్

by Disha Web Desk 21 |
లోకేశ్‌పై అంబటి సెటైర్లు:‘అరగంట కోసం కాదుగా సోం బేరి సారు..’ అంటూ అయ్యన్న కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. బహిరంగ వేదికలే కాదు సోషల్ మీడియా వేదికగానూ నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటారు. ఇతరులు కామెంట్స్ చేయకపోయినా..అంబటి రాంబాబు మరీ ట్విటర్‌ వేదికగా సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇలా నారా లోకేశ్‌ ఢిల్లీ టూర్‌పై ఇటీవల మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. అంబటి రాంబాబు ట్వీట్‌కు కౌంటర్‌గా మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ట్వీట్ మరింత రసవత్తరంగా మారింది. ఇంతకీ ఆ ట్వీట్స్ కహానీ ఏమిటో ఓ సారి చూద్దాం.

స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం.. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి తండ్రిని బయటపడేసేందుకు నారా లోకేశ్ ఢిల్లీ బాట పట్టారు. అక్కడ లాయర్లను కలుస్తూ కోర్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నారనుకోండి. ఈ అంశంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యా పిల్లలను వదిలి ఢిల్లీకి పారిపోయిన పిరికి బడుద్దాయి’ అంటూ లోకేశ్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌ను చూసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు కౌంటర్ ఇచ్చారు.అంబటికి అంతే స్థాయిలో అయ్యన్నపాత్రుడు ఘాటుగా ట్వీట్ చేశారు.‘ తండ్రి కోసమే గా వెళ్ళింది..." అరగంట కోసం" కాదుగా సోం బేరి సారు..’ అంటూ అయ్యన్నపాత్రుడు రిప్లై ఇచ్చారు. గతంలోనూ అంబటి రాంబాబు, అయ్యన్నపాత్రుడుల మధ్య ట్విటర్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఈ వివాదం మరింత పెరుగుతుందా?లేక ఇక్కడితో ఇరువురు ఫుల్ స్టాప్ పెడతారా? అనేది వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed