మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్: కన్నీరు పెడుతున్న అన్నదాత

by Seetharam |
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్: కన్నీరు పెడుతున్న అన్నదాత
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్‌ తుఫాన్ రైతుల నడ్డి విరిచింది. ఆరు కాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్‌ తుఫాన్‌ వారిపాలిట శాపంగా మారింది. సిరులు కురిపించాల్సిన వరి నీటమునిగింది. అంతేకాదు కుప్పలు సైతం తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులకు అపార నష్ట వాటిల్లింది. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు పర్యటించారు. నగరం, మామిడికుదురు ప్రాంతాల్లో నీటమునిగిన వరిపొలాలను పరిశీలించారు. కోతకోసిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతోపాటు ఈదురుగాలులు, భారీ వర్షాలకు నీటమునిగిన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులకు ఇలాంటి విపత్తు రూపంలో నష్టం వాటిల్లడం చాలా దురదృష్టకరమని జాలెం సుబ్బారావు అన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు సబ్సిడీ కింద విత్తనాలు సైతం అందజేయాలని టీడీపీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు ఆనందరావు, వడ్డి ప్రభాకర్ రావు, మెుల్లేటి శ్రీనివాస్, తాటికాయల ఉదయ్ భాస్కర్, బొంతు సత్యం, జాలెం రాజేశ్, కడలి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed