వైద్యం వ్యాపారం కాదు ఒక సేవా కార్యక్రమం: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

by Disha Web Desk 21 |
వైద్యం వ్యాపారం కాదు ఒక సేవా కార్యక్రమం: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైద్యం వ్యాపారం కాదని ఒక సేవా కార్యక్రమం అని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలో ఆదివారం వెంకయ్య నాయుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో సేవా భావం తగ్గిందని వ్యాఖ్యానించారు. నేడు రాజకీయం, విద్య, వైద్య రంగాల్లో సేవా భావం గణనీయంగా తగ్గిందన్నారు. వాటిలొ ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. వైద్య వృత్తి సామాజిక బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. వైద్యులు ప్రజల కోసం అంకిత భావంతో పని చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు సమాజానికి మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైద్యులు పని చేయాలని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వైద్యులు నష్టపోకుండా.. అదే సమయంలో లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు అందించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.

వైద్యులు రోగులతో సహనంగా మెలగాలి

వైద్యుడిని దేవుడిగా ప్రజలు కొలుస్తారని... వారి మాట వేద వాక్కుగా భావిస్తారని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ప్రజల నమ్మకం పట్ల వైద్యులు నిజాయితీగా పని చేసి, రోగి త్వరగా కోలుకుని ఇంటికి పంపేలా చూడాలని వెంకయ్య నాయుడు సూచించారు. వైద్యులు రోగులతో ఎంతో సహనంగా, స్నేహ భావంతో మెలగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు వైద్యులు అవసరం లేకున్నా టెస్టులు, స్కానింగ్‌లు రాస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని దాన్ని రూపుమాపేలా చూడాల్సిన అవసరం వైద్యులపై ఉందని చెప్పుకొచ్చారు. వైద్య సిబ్బంది కూడా ప్రేమగా, మంచిగా మాట్లాడితే రోగులకు సగం జబ్బు తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. దేశంలో చాలా మంది పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి లేనిపోని రోగాలు కొని తెచ్చుకుని ఆస్పత్రిపాలవుతున్నారని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు.

హెల్ ఫోన్‌గా సెల్ ఫోన్

ప్రస్తుతం యువతను సెల్‌ఫోన్ శాసిస్తుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఇంట్లో భోజనం చేసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని కంటి నిండా నిద్రపోవడం లేదని అన్నారు. సెల్ ఫొన్‌ను హెల్ ఫోన్‌గా మార్చారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అర్ధరాత్రి యువత ఫోన్‌లకు అలవాటు పడ్డారని ఇది సరైంది కాదని అన్నారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలలోపు నిద్ర లేవాలని అనంతరం వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం ఆధ్యాత్మిక భావనలో కాసేపు ఉండటం యువత నేర్చుకోవాలని సూచించారు. అలాగే కాలంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను సైతం మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మిల్లెట్స్‌ని తినడం అలవాటు చేసుకోవాలని ఫలితంగా మంచి శక్తిని పొందగలుగుతారని అన్నారు. అలాగే చిరు ధాన్యాలతో భోజనం చేయాలని...శారీరక శ్రమ లేకపోతే జబ్బులబారినపడే ప్రమాదం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.

Next Story

Most Viewed