అందరి జీవితాల్లో భోగభాగ్యాలు కలగాలి : జీవీఎల్

by Thanuru Gopichand |

సంక్రాంతి అంటే సినిమాలు.. సెలవులు కాదు.

అందరి జీవితాల్లో భోగభాగ్యాలు కలగాలి : జీవీఎల్
X

దిశ, వెబ్ డెస్క్ : భోగి (Bhogi) పండుగను పురస్కరించుకొని అందరి జీవితాల్లో చెడు పోయి భోగభాగ్యాలు నిండాలని బిజెపి నేత.. మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు (GVL Narasimha Rao) ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ సంక్రాంతి (Atma Nirbhara Bharat Sankranti) సంబరాలను విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. జనవరి 4న రాటపూజ ఉత్సవంతో జీవీఎల్ మహా సంక్రాంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న వేడుకలను భోగి మంటలతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహ రావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ ఈ ఏడాది ఆత్మనిర్భర సంక్రాంతిగా పేరు పెట్టామన్నారు. స్వదేశీ నినాదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. స్వదేశీ వస్తువుల కొనుగోలు, స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా సద్వేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి కోరారన్నారు. అంతేకాకుండా దేశ సంస్కృతిని, సంపదలను కాపాడుకోవాలన్నారు. చరిత్రను తెలుసుకోవడమే కాకుండా బానిసత్వాన్ని విడనాడి పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని కోరారు. తద్వారా దేశాన్ని ఆర్థికంగా, సంస్కృతికంగా బలపరచాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారన్నారు. అందుకు అనుగుణంగా తాము కూడా ఈ ఏడాది ఆత్మనిర్భర భారత్ నినాదంతో సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని జీవీఎల్ వెల్లడించారు.

సంక్రాంతి అంటే పిల్లలు సెలవులు, సినిమాలు చూడటం అనే ధోరణి పెరిగిందన్నారు. అందుకు భిన్నంగా పట్టణవాసులు కూడా సంక్రాంతి అంటే సంస్కృతి అని తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సంక్రాంతి సందడిని విశాఖవాసుల ముంగిటకు తెచ్చామన్నారు. నేటి తరం పరంపరను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం అన్నారు.

Next Story