ఆదోని నియోజకవర్గంలో జోరుగా మద్యం దందా.. జేబులు నింపుకుంటున్న ఎక్సైజ్ అధికారులు ?

by Disha Web Desk 6 |
ఆదోని నియోజకవర్గంలో జోరుగా మద్యం దందా.. జేబులు నింపుకుంటున్న ఎక్సైజ్ అధికారులు ?
X

దిశ, ఆదోని: నియోజకవర్గంలో కర్ణాటక మద్యం దందా జోరుగా సాగుతోంది. ప్రతి గ్రామంలో, ఆదోని పట్టణంలో విచ్చలవిడిగా దొరుకుతున్నది. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన వైన్స్ అమ్మకాల కంటే వీటి సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నియంత్రించవలసిన అధికారులు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా, పట్టించుకోకుండా నెల నెలా మాముళ్లు వసూలు చేసుకునే పనిలో ఉన్నట్లు విమర్శలు ఎక్కువయ్యాయి.

గత ప్రభుత్వంలో అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ఎక్సైజ్ పోలీసులు ఉండేవాళ్లు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీ మేరకు సెబ్‌ను రెండు శాఖలుగా వేరు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలపై పర్యవేక్షణకు ఎక్సైజ్ అధికారులు నియమించింది. అక్రమ మద్యం, ఇసుక రవాణా, గుట్కా, మట్కాకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు మండలాల గ్రామాల్లో, ఆదోని పట్టణంలో కర్ణాటక మద్యం యథేచ్చగా దొరుకుతున్నా, ఎందుకు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది.

అంతా ఆ కానిస్టేబుల్‌కు తెలిసే..

కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులకు ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దాదాపు ఆదోనీలోని 40 వార్డుల్లో, గ్రామాల్లో వ్యాపారులతో సత్సంబంధాలు నెరుపుతూ నెల నెలా మాముళ్లు వసూలు చేస్తూ, పై అధికారులకు కూడా పంచి పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల జీతంతో పాటు రెండు లక్షలు రూపాయలుపైబడే వాటాలు వేసుకుంటున్నట్లు పంచుకుంటున్నారని బాగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్ లకు సదరు ఎక్సైజ్ కానిస్టేబుల్ తలనొప్పిగా మారినట్లు ఉద్యోగులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. నిత్యం వైన్ షాపుల వద్దకు వస్తూ షరతులు విధిస్తూ అజమాయిషీ చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇన్ని విమర్శలకు కారణమవుతున్నసదరు కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.


Next Story