నేటితో లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు .. అడుగులో అడుగేసిన కుటుంబం

by Disha Web Desk 21 |
నేటితో లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు .. అడుగులో అడుగేసిన కుటుంబం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గాజువాక నియోజకవర్గం శివాజీ నగర్‌లో నేటితో పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర చివరిరోజైన సోమవారం గాజువాక నియోజకవర్గం సీడబ్ల్యూసీ-1 నుంచి పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నారా వారి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇకపోతే చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేశ్‌ యువగళం ప్రారంభమైంది. 226 రోజులుపాటు కొనసాగిన ఈ పాదయాత్ర నేటి సాయంత్రం అగనంపూడి వద్ద ముగియనుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండంలలోని పోలిపల్లి వద్ద యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ ముగింపు సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతోపాటు, అతిరథ మహారథులు సైతం హాజరుకానున్నారు.

పాదయాత్ర సాగిందిలా!

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మంగా యువగళం పాదయాత్రను నిర్వహిస్తోంది. యువగళం రధసారథి నారా లోకేశ్ ఈ యువగళం పాదయాత్రను ఇప్పటి వరకు 97 నియోజకవర్గాల్లో నిర్వహించారు. 226రోజులపాటు 3,132 కి.మీ.మేర లోకేశ్ పాదయాత్ర నడిచింది. ప్రతీ జిల్లాలోనూ లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి జిల్లాల వారీగా చిత్తూరులో 14 నియోజకవర్గాల్లో 45రోజుల పాటు 577 కి.మీ.సాగింది. ఇకపోతే అనంతపురం జిల్లాల్లోని – 9 నియోజకవర్గాల్లో 23రోజుల పాటు 303 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. కర్నూలులో – 14 నియోజకవర్గాల్లో – 40రోజుల పాటు – 507 కి.మీ. మేర సాగిన పాదయాత్ర...కడపలో – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ.మేర సాగిన పాదయాత్ర, నెల్లూరులో – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.మేర సాగిన పాదయాత్ర, ప్రకాశం జిల్లాలో – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ.మేర సాగిన పాదయాత్ర సాగింది. గుంటూరు జిల్లాలో – 7 నియోజకవర్గాలలో 16రోజులపాటు 236 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. ఇకపోతే కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాలలో 8రోజులపాటు 113 కి.మీ.లు మేర జరిగింది.

నేటితో ముగింపు

మరోవైపు ఉభయగోదావరి జిల్లాలోనూ లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పశ్చిమగోదావరి జిల్లా 8 నియోజకవర్గాలలో 11రోజులపాటు 225.5 కి.మీ.మేర లోకేశ్ పాదయాత్ర నడిచింది. తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాల మీదుగా 12రోజులపాటు 178.5 కి.మీ.మేర పాదయాత్ర జరిగింది. ఇకపోతే విశాఖపట్నం జిల్లాలో 5నియోజకవర్గాలలో 7రోజులపాటు 113 కి.మీ.మేర పాదయాత్ర సాగింది. ఇపోతే ఈనెల 18న సాయంత్రం గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక నియోజకవర్గం శివాజీనగర్‌లో యువగళం పాదయాత్ర ముగియనుంది. చారిత్రక ఘట్టానికి గుర్తుగా సాయంత్రం శివాజీనగర్‌లో పైలాన్‌ను యువనేత లోకేశ్ ఆవిష్కరించనున్నారు.

తండ్రి సెంటిమెంట్‌తో లోకేశ్

ఇకపోతే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు విషయంలో తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగించారు. అదే రీతిలో నేడు నారా లోకేశ్ సైతం ఆగనంపూడి వద్దనే పాదయాత్రను ముగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే సెంటిమెంట్‌తో అధికారంలోకి రావడంతో అదేసెంటిమెంట్‌ను నారా లోకేశ్‌ సైతం ఫాలో అవుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడుకు గతంలో కలిసి వచ్చిన మాదిరిగానే ఈ సారి లోకేశ్‌కు కలిసి వస్తుందని టీడీపీ కార్యకర్తలు సైతం భావిస్తున్నారు.


అడుగులో అడుగేసిన భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో జాతరను తలపిస్తోంది. 226వరోజు పాదయాత్రలో నారా లోకేశ్‌తో కలిసి తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు సైతం పాల్గొన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర చివరి ముగింపునకు తెలియడంతో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అంతేకాదు వివిధ రకాల నృత్యాలు, గరగలు, డప్పులచప్పులు, బాణాసంచా మోతలతో యువగళం పాదయాత్ర దద్దరిల్లుతుంది.స్టీల్ ప్లాంట్ ప్రాంతం అంతా నారా లోకేశ్ యువగళంతో మార్మోగిపోతుంది. యువగళం పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు, రోడ్లవెంట బారులు తీరారు. యువనేతకు సంఘీభావంగా ప్లకార్డులు చేతబూని స్టీల్ ప్లాంట్ తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed