రామాలయ పునర్నిర్మాణానికి లైన్ క్లియర్: న్యాయవాది రవి ప్రసాద్‌పై ఆర్ఆర్ఆర్ ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటూ దాఖలైన పిల్ పై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది...

రామాలయ పునర్నిర్మాణానికి లైన్ క్లియర్: న్యాయవాది రవి ప్రసాద్‌పై ఆర్ఆర్ఆర్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) ఆకివీడు రామాలయ(Akiveedu Rama Temple) పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటూ దాఖలైన పిల్ (PIL)పై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Highcourt)లో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి. రవి ప్రసాద్ తన వాదనలను అత్యంత సమర్థవంతంగా వినిపించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చట్టబద్ధతను, ధార్మిక అంశాలను ఆయన కోర్టుకు వివరించారు.

రఘురామ హర్షం

ఈ పరిణామంపై ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో అద్భుతంగా వాదనలు వినిపించి, ఆలయ పునర్నిర్మాణానికి మార్గం సుగమం చేసినందుకు రవి ప్రసాద్‌కు, వారి న్యాయ బృందానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ధర్మం వైపు నిలబడి పోరాడిన వారికి ఈ విజయం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే తొలగిపోతాయి..

ఆలయ నిర్మాణంపై ఎదురవుతున్న అడ్డంకులన్నీ త్వరలోనే తొలగిపోతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా పనులు పూర్తి చేస్తామని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. రామాలయ పునర్నిర్మాణం ఆకివీడు భక్తుల చిరకాల వాంఛ అని, దానిని సాకారం చేసే వరకు వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రామాలయంకు లైన్ క్లియర్

కాగా ఆకివీడులో నిర్మిస్తున్న శ్రీరామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం చట్టవిరుద్ధంగా జరుగుతోందని, తగిన అనుమతులు లేవని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్ చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేస్తూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్ చేసింది. దీంతో రఘురామకృష్ణంరాజు స్పందించారు.

Next Story