అర్థరాత్రి ఛేజింగ్.. గోవులను కాపాడిన ఏపీ ఎమ్మెల్యే

by Thanuru Gopichand |

గోవుల అక్రమ రవాణా నిరోధించి.. వాటిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే.

అర్థరాత్రి ఛేజింగ్.. గోవులను కాపాడిన ఏపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్ : గోవధపై నిషేధం ఉన్నా చట్టాల (Prohibition Of Cow Slaughter) అమలులో వ్యవస్థల అలసత్వం బయటపడుతూనే ఉంది. వేలాది గోవులు అక్రమంగా కబేళాలకు తరలుతూనే ఉన్నాయి. కబేళాల్లోనే కాదు వాటిని అక్రమంగా రవాణా చేసేటప్పుడు కూడా నరకయాతనను గోవులు అనుభవిస్తున్నాయి. నిబంధనల ప్రకారం గోవులు నిలబడటాని, కూర్చోవడానికి పట్టేంత స్థలం వాహనంలో ఉండాలి.. అంతేకాకుండా వాటిని నీరు ఆహార సదుపాయం కల్పించాలి. కానీ వాటిని కూడా బేఖాతరు చేస్తున్నారు గోవులను అక్రమంగా తరలించేశారు. జంతువుల సంరక్షణ చట్టాన్ని అపహాస్యం చేసేలా ఒకే వాహనంలో పదుల సంఖ్యలో గోవులను ఇరిక్కించి.. ఒకదానిపై ఒకటి పడేలా.. ఒకదాని కింద ఇంకొకటి తొక్కబడేలా కుక్కి తరలిస్తున్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడక్కడ కొందరు మానవతా వాదులు వాటిని అక్రమ రవాణా నుంచి, కబేళాకు వెళ్లడం నుంచి రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. వారి కోవలోనే తాను కూడా గోవులను రక్షించారు ఏపీలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya).

వివరాల్లోకి వెళ్తే తెలంగాణ (Telangana) మీదుగా కడప జిల్లా పులివెందులకు (Pulivendula) గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ సమాచారం అందుకున్నారు. అర్థరాత్రి వేళ అందిన సమాచారంతో ఒక్కసారిగా రంగంలోకి దిగారు. జాతీయ రహదారిపై గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రక్కులను గుర్తించి వాటిని ఛేజ్ చేశారు. వాటిని రోడ్డుపైనే నిలిపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో ట్రక్కులను తెరిచి చూడగా గుండె తరక్కుపోయే దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక కంటైనర్లో 70కి పైగా ఆవులను అత్యంత దయనీయ స్థితిలో రవాణా చేస్తున్న చిత్రం ఎమ్మెల్యే కంటబడింది. దీంతో ఆమె అక్రమ రవాణాదారులపై సీరియస్ అయ్యారు.

వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డ్రైవరుతో పాటు యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. అక్రమ రవాణా వెనుక ఉన్నవారిని అందరినీ బయటకు లాగి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆరు ట్రక్కుల్లో తరలిస్తున్న సుమారు 400ల గోవులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాపాడారు. అనంతరం వాటిని గోశాలకు తరలించి పోలీసులకు అప్పగించారు. ఎమ్మెల్యే చొరవ పట్ల మానవతావాదులు, జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తే గోవధ జరగదని.. ఎమ్మెల్యేలు సైతం రోడ్డుపైకి వచ్చి సాహసాలు చేయాల్సిన అవసరం రాదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story