వడ్డెర కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తాం: నారా లోకేష్

by Disha Web Desk 16 |
వడ్డెర కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తాం: నారా లోకేష్
X

దిశ, ఎమ్మిగనూరు: టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అదే క్రమంలో వడ్డెర కొర్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికిచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలోని ముగతి గ్రామంలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముగతి ఈరన్న గౌడ్, ముగతి గ్రామ అధ్యక్షుడు భార్గవ్ యాదవ్, ముగతి మాజీ సర్పంచ్ బాలరాజు, కొండారెడ్డి, గిర్ని అంజినయ్య తదితర నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ గ్రామ మహిళలతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు అందిస్తామని పునరుద్ఘటించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. గ్రామంలో వైసీపీ నాయకుడు సహకార సొసైటీ బ్యాంకును అక్రమంగా కూలగట్టిన బ్యాంకును సెల్ఫీ దిగి వారికి రాబోయే రోజుల్లో తగిన శిక్ష పడేట్లు చూస్తానన్నారు. అలాగే బీసీలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

బీసీలను బ్యాంక్‌ బోన్‌ అన్న సీఎం జగన్‌ నేడు వాళ్ల బ్యాక్‌ బోన్ విరుస్తున్నారని దుయ్యబట్టారు. వడ్డెర్ల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలను తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. విధులు, నిధులు, కనీసం కుర్చీలూ లేని కార్పొరేషన్లు ఇచ్చి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని తాము తలపెడితే..వైసీపీ నిలిపేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేస్తామన్నారు. దామాషా ప్రకారం వడ్డెర కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తామని, వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని నారా లోకేశ్ హామీచ్చారు

Next Story

Most Viewed