Nandyala: పది, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

by Disha Web Desk 16 |
Nandyala: పది, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్, పదో తరగతి అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 51 పరీక్షా కేంద్రాల్లో 26,970 మంది విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 125 పరీక్షా కేంద్రాల్లో 25,411 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలన్నారు. కేంద్రాల వద్ద పారిశుధ్యంతో పాటు తాగునీటి వసతులు కల్పించాలని మున్సిపల్ కమీషనర్‌కు కలెక్టర్ టి.నిశాంతి సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేయాలన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాలను పార్సెల్ ద్వారా డిస్పాచ్ చేసేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించాలని పోస్టల్ అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు.

Next Story