ఒక్క కేసు కూడా నమోదు కాకూడదు: Nandyala Collector

by Disha Web Desk 16 |
ఒక్క కేసు కూడా నమోదు కాకూడదు: Nandyala Collector
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఈ ఏడాది జిల్లాలో జీరో మలేరియా కేసులు నమోదయ్యేలా పకడ్బందీగా విధులు నిర్వహించాలని వైద్యాధికారులు, మలేరియా అధికారులను నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. కలెక్టరేట్‌ భవనం వైఎస్ఆర్ సెంటినరీ హాలులో ప్రపంచ మలేరియా దినోత్సవానికి సంబంధించిన గోడ

పత్రికలు, ఫ్లెక్సీ బ్యానర్లను ఆవిష్కరించారు. మలేరియా వ్యాధికి సంబంధించి గత సంవత్సరం 8 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాకుండా మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మలేరియా వ్యాధి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలను మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్లి పటిష్టంగా అమలు పరచాలన్నారు. మలేరియా వ్యాధి నిర్మూలన పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు. మలేరియా వ్యాధి ప్రబలకుండా

దోమల పెరుగుదలను అరికట్టాలని సూచించారు. ఇంటి ముందు గల మురుగు కాల్వల్లో చెత్తా చెదారం వేయకూడదని, మురుగు నీరు ఎప్పుడూ పారేటట్లు చూడాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురుగు నిల్వలో వారానికోసారి కిరోసిన్ ఆయిల్‌తో దోమల పుట్టుకను నివారించాలన్నారు. దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి తదితర వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డీసీహెచ్ఎస్ జఫురుల్లా, జిల్లా మలేరియా అధికారి కామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed