నెల రోజుల్లో సీఎం ఇల్లు ముట్టడిస్తాం: బైరెడ్డి శబరి

by Disha Web Desk 16 |
నెల రోజుల్లో సీఎం ఇల్లు ముట్టడిస్తాం: బైరెడ్డి శబరి
X

దిశ, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని, నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా మోసం చేస్తుందని, నెల రోజుల్లో మెగా జాబ్ క్యాలెండర్ కోసం ప్రకటన చేయకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు.

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ‘అన్నా ఓ జగనన్నా..ఎక్కడన్నా మా జాబ్’ అంటూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. వీరి ధర్నాకు రాష్ట్ర ఈమె మద్దతు తెలిపి వారితో కలిసి నిరసన తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. ప్రతిజనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీచ్చి ముఖం చాటేశారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్నా ఏ హామీ

నెరవేర్చలేదని, వాలంటీర్ జాబ్‌తో నెలకు రూ.5 వేలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ ఏమైందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న జగన్ హామీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మెగా జాబ్ మేళాలతో నిరుద్యోగ యువతను జగన్ ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. ఉన్నత చదువులు చదివి అటు ఇళ్ల వద్ద పనులు చేసుకోలేక, ఇటు ఉద్యోగం లేక నిరుద్యోగులు మానసికంగా కృంగుబాటుకు గురౌతున్నారన్నారు. ప్రభుత్వం మద్యం షాపులు, చికెన్, మటన్ దుకాణాలలో ఉద్యోగం చేయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిరుద్యోగ యువత ఆవేశం, ఆగ్రహానికి గురౌతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలే నిదర్శనమన్నారు. అందువల్ల సీఎం ఇప్పటికైనా మేల్కోకపోతే పతనం తప్పదని జోష్యం చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నంద్యాల జిల్లా అధ్యక్షులు చైతన్య కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు, కార్యదర్సులు మహేష్, మనోజ్, చంద్రపాల్ నాయుడు, రాష్ట్ర సభ్యులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed