రూ.20 లక్షలకు లెక్కలు తేల్చని పెద్దలు

by Disha Web Desk 10 |
రూ.20 లక్షలకు లెక్కలు తేల్చని పెద్దలు
X

దిశ, కర్నూలు : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ శివారు ప్రాంతంలో 8,500 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల పథకాలను ఒకే చోట నిర్మించారు. వీటిని 2014 ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేశారు. ప్రారంభించిన ఏడాదిలో రైతులకు పుష్కలంగా సాగు నీరు సరఫరా అయింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి సరైన రీతిలో నీరు సరఫరా జరగక రైతులు ఇబ్బందులు పడ్డారు. నీటి కోసం కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రైతులకు సకాలంలో నీటిని సరఫరా చేసేందుకు వాచ్ మెన్, మోటార్ల మరమ్మతుల కోసం ఎర్రమఠం, గుమ్మడాపురం, కొత్తపల్లె, శివపురం, సింగరాజుపల్లె, ముసలిమడుగు వంటి గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అయితే, ఆ నగదును నిర్వహణ కోసం ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. కొందరు పెత్తందార్లు డబ్బుల చెల్లించలేదు. దీంతో పెద్దరికంగా బాధ్యత తీసుకున్న కొందరు ఎర్రమఠం గ్రామానికి చెందిన రైతుల డబ్బులను సొంత ఖర్చుల కోసం వాడుకున్నారు. ప్రశ్నించిన వారికి ఎలాంటి సమాధానం చెప్పకపోవడమే కాకుండా రాజకీయం చేయడంతో నిలదీసేందుకు రైతులు ముందుకు రాలేదు.

రూ.20 లక్షల నిధి మాయం ?

2016 నుంచి ఈ ఎత్తిపోతల పథకాలు నిర్వహణ లేమీ కారణంగా ఆశించిన స్థాయిలో రైతులకు సాగు నీరు అందలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. మోటర్లు కాలిపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఎర్రమఠం గ్రామ పెద్దలు రైతులకు సాగు నీరు అందాలంటే ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేశారు. ఇలా దాదాపు రూ.20 లక్షల వరకు పోగు చేశారు. అందులో ఎలాంటి డబ్బులు చెల్లించని, వారిదే పెత్తనం కావడంతో ఆ రైతుల నిధిని వారి వద్దే ఉంచుకున్నారు. ఏ పనికి వినియోగించిన దాఖలాల్లేవు. వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయో అడిగేందుకు కూడా రైతులు జంకుతున్నారు.

మరలా ఇవ్వాలని డిమాండ్

కాగా, రానున్న వర్షాకాలంలో ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సహకరించాలని మరలా రైతులను కోరుతున్నారు. గతంలో చెల్లించిన డబ్బుల లెక్కల వివరాలు చెప్పకుండా మళ్లీ డబ్బులు ఎందుకు చెల్లించాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకాల నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో వాటికోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దుండగులు దొంగిలించుకుపోయారు. శివపురం ఎత్తిపోతల పథకం మాత్రం రైతుల సహకారంతో సజావుగా సాగుతోంది. వారి మాదిరిగానే సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ బాధ్యతను నిబద్ధతతో కల్గిన వారికి అప్పగించాలని రైతులు కోరుతున్నారు.


Next Story