బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయ్ : ఐజీ ప్రవీణ్

by Naga Rani Yarlagadda |

బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయని ఆరోపించారు. బస్సులు ప్రమాదాలకు గురైతే.. ప్రయాణికుల ప్రాణనష్టం తగ్గించేలా బస్సు నిర్మాణంలో మెటీరియల్ వాడటం లేదన్నారు.

బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయ్ : ఐజీ ప్రవీణ్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సుప్రమాదంతో (Kurnool Bus Accident) తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. కల్లెడ మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో నేషనల్ హైవే 44పై బెంగళూరు వెళ్తున్న టూ వీలర్ ను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ (Kaveri Travels Bus Accident) బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లి.. ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టగా నిప్పు రాజుకుని మంటలు చెలరేగాయి. డ్రైవర్లు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఇద్దరు డ్రైవర్లు పరారయ్యారు. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Bus Emergency Exit) ద్వారా ప్రమాదం నుంచి బయటపడగా.. మిగతా ప్రయాణికులు బయటకు వచ్చేందుకు డోర్ ఓపెన్ కాకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు కలెక్టర్ సిరి (Collector Siri) వెల్లడించారు. మిగతా ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

ఈ ఘటనపై కర్నూల్ రేంజ్ ఐజీ కోయ (Kurnool IG Koya Praveen) ప్రవీణ్ స్పందించారు. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయని ఆరోపించారు. బస్సులు ప్రమాదాలకు గురైతే.. ప్రయాణికుల ప్రాణనష్టం తగ్గించేలా బస్సు నిర్మాణంలో మెటీరియల్ వాడటం లేదన్నారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేలా బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవన్నారు. బస్సుల ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీపై సమీక్ష జరగాలని, బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలన్న దానిపై కూడా అధ్యయనం చేయాలని ఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. వారిలో కొందరు మాత్రం అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారని, స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఏసీ స్లీపర్ బస్సు కావడంతో మంటలకు పొగ బస్సు మొత్తం అలుముకుని ప్రయాణికులకు ఊపిరాడని పరిస్థితి నెలకొందని వివరించారు. బస్సు డోర్ తెరుచుకోకపోవడం, బస్సులో నుంచి బయటికి వచ్చే దారి కూడా ఇరుకుగా ఉండటంతో చాలా మంది లోపలే ఉండిపోయి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బస్సు నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల తీవ్రతను పెంచేలా ఉందన్నారు.

Next Story