GVL: పోలవరం ప్రాజెక్టుకు త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు

by Disha Web Desk 16 |
GVL: పోలవరం ప్రాజెక్టుకు త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు
X
  • కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లు
  • ఏపీకి కేంద్రం భారీగా నిధులిస్తుంటే వైసీపీ గుట్టుగా ఖర్చు చేస్తోంది
  • పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని సానుకూలంగా ఉన్నారు
  • త్వరలో పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 కోట్లు విడుదల
  • - బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ లబ్ధి ఆశించకుండా ఏపీ రాష్ట్ర ప్రజల కోసం రెవెన్యూ లోటు భర్తీకి ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేశారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతో ఏపీకి నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రూ.10 వేల 461 కోట్లు రెవెన్యూ గ్రాంట్‌గా ఏపీకి కేంద్రం కేటాయించిందని స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో ఎంపీ జీవీఎల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారని కొందరు అడుగుతున్నారని..ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో చూడలేదని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ది కోసం పని చెయ్యరని, ప్రజల కోసం పనిచేస్తారని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని విమర్శించారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని చాలా సానుకూలంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. పోలవరం 41.15 మీటర్ల వరకు తొలి దశ నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్యం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో‌ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను చార్జిషీటు ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.

పోలవరంకు రూ.12,911 కోట్లు

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు ఇవ్వబోతున్నట్టు ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది అని స్పష్టం చేశారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇచ్చినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది అని ప్రకటించారు. త్వరలో కేంద్ర కెబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పుకొచ్చారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

కేంద్రం అప్పులపై పరిమితికి కారణం ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఎంపీ జీవీఎల్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల కాలంలో రూ. 55 వేల కోట్ల మేర నరేగా నిధులిచ్చింది అని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ది మరెవరికీ చేకూరలేదని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రధాని మోడీ సరికొత్త వరాలు ప్రకటించారని చెప్పుకొచ్చారు. ‘రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారు.స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారు. ఈ రూ. 10 వేల కోట్లు ఏపీ ప్రజలకు వరం’ అని ఎంపీ జీవీఎల్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోంది అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయి అని జీవీఎల్ గుర్తు చేశారు. దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించింది అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ.5వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించాం అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.


Next Story

Most Viewed