Mailavaramలో వైసీపీ, టీడీపీకి కొత్త తలనొప్పి!

by Disha Web Desk 16 |
Mailavaramలో వైసీపీ, టీడీపీకి కొత్త తలనొప్పి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అభ్యర్థులకు టికెట్ కేటాయించే విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాదరణ, ఆర్థిక స్థోమతలతోపాటు స్థానికత కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ లొల్లి అనేది ఒక్కోసారి ఓటమిలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే లోకాలిటీ అనేది చాలా ముఖ్యం. అయితే ఒక్కోసారి పార్టీ గాలిలో నాన్ లోకల్స్ కూడా గెలిచిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ లోకల్.. నాన్ లోకల్ లొల్లి మైలవరం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ మొదలైంది. అసలు పొరుగింటి వాడు వచ్చి మన ఇంట్లో పెత్తనం చేస్తే.. చూస్తూ ఊరుకుంటామా అంటున్నారు నియోజకవర్గం నేతలు. అంతేకాదు రాజకీయ పార్టీలకు సైతం అల్టిమేటం జారీ చేశారు. లోకల్ వాళ్లకే టికెట్ ఇవ్వాలని నాన్ లోకల్స్‌కు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

నాన్ లోకల్స్ మాకొద్దు


కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం అత్యంత కీలకం. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలకు కొత్త తలనొప్పి మొదలైంది. నియోజకవర్గానికి చెందిన నేతలు లోకల్, నాన్ లోకల్ వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న దేవినేని ఉమా ఇద్దరూ కూడా పక్కనే ఉన్న నందిగామ నియోజకవర్గానికి చెందినవారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మైలవరం నియోజకవర్గంలో పెత్తనం చెలాయించడం ఏంటని స్థానిక నాయకులు చాలా గుర్రుగా ఉంటున్నారు. గత మూడేళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలు ఇప్పుడు దూకుడు పెంచారు. ఏకంగా నాన్ లోకల్ నాయకులు తమకు వద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాన్ లోకల్‌గా గెలుస్తున్న నేతలు నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన గొడవలన్నింటిని ఇక్కడకు తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ పంచాయతీల లొల్లి ఏంది అని నిలదీస్తున్నారు.

పార్టీల్లో మొదలైన తలనొప్పి


ఇదిలా ఉంటే ఈ లోకల్ నాన్ లోకల్ అంశాన్ని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేశ్ బాబు సైతం తెరమీదకు తెస్తున్నారు. ‘మన మైలవరం- మన నాయకత్వం’ పేరుతో ఇటీవలే ఒక బ్రోచర్‌ను సైతం విడుదల చేశారు. దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని అలాగే ప్రజలు కూడా స్థానికులకే పట్టం కట్టాలని కోరారు. రెండు దశాబ్దాలుగా మైలవరం నియోజకవర్గం నుంచి స్థానికేతరులకే ఆయా రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. నాన్ లోకల్స్ పాలించడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో చాలా ఆర్థిక వనరులు ఉన్నాయని, అందుకే స్థానికేతర నాయకులు ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవినేని ఉమా మహేశ్వరరావుకు సైతం ఈ తలనొప్పి తప్పడం లేదు. దేవినేని ఉమా మహేశ్వరరావు నాన్ లోకల్ అంటూ ఆ పార్టీ నేతలే తిరుగుబాటు ఎగురవేశారు. చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టినా కూడా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

అసలు లొల్లి ఇదే

2014, 2019 ఎన్నికల్లో అటు దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇటు వసంత కృష్ణప్రసాద్‌ గెలుపొందారు. ఇరువురు నేతలు నాన్ లోకల్స్. దేవినేని ఉమా మహేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గం నేతల కంటే నందిగామ నియోజకవర్గం నేతలే ఎక్కువ చక్రం తిప్పారని స్థానిక నేతలు అంటున్నారు. నందిగామ నియోజకవర్గానికి చెందిన తమ సొంత వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడి మట్టి, ఇసుకను తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని అప్పుడు దేవినేని ఉమా మహేశ్వరరావుపైనా నేడు వసంత కృష్ణప్రసాద్‌లపైనా ఆరోపణలు ఉన్నాయి. మైలవరంలోని స్థానిక నాయకులు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తోందని, ఇలాంటి బానిస బతుకులు మైలవరం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు వద్దని స్థానిక నేతలు తేల్చి చెప్తున్నారు.

అసలు పొరుగింటి వాడు వచ్చి మన ఇంట్లో పెత్తనం చేస్తే.. చూస్తూ ఊరుకుంటామా అని ప్రజలను ప్రశ్నించారు. మరోవైపు నియోజకవర్గంలో ఆయా పార్టీల మధ్య అసమ్మతికి ఈ నేతల దిగుమతే కారణమని ఆరోపిస్తున్నారు. అందువల్లే స్థానికేతరుడు తమకు వద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మైలవరంలో స్థానిక నాయకులకే అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావు స్థానికత అంశాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాన్ లోకల్ అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో సెపరేట్ మీటింగ్‌లు సైతం నిర్వహిస్తున్నారు. దీంతో అటు వైసీపీ ఇటు టీడీపీలకు ఈ లోకల్, నాన్ లోకల్ పోరు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది.



Next Story