కృష్ణా జిల్లా చంద్రబాబు పర్యటన.. ప్రత్యేకంగా భేటీ అయి టీడీపీ నేతల కీలక నిర్ణయం

by Disha Web Desk 16 |
కృష్ణా జిల్లా చంద్రబాబు పర్యటన.. ప్రత్యేకంగా భేటీ అయి టీడీపీ నేతల కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటన విజయవంతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, బోడె ప్రసాద్, సీనియర్ టీడీపీ నేతలు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావులు హాజరయ్యారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించారు.


అనంతరం దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు చంద్రబాబు ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్‌గా చేస్తే జగన్ రాష్ట్రాన్ని గంజాయి, అప్పుల ప్రదేశ్‌గా మార్చారన్నారు. తప్పుడు కేసులు, దాడులతోనే జగన్ పాలన కొనసాగుతుందని దేవినేని ఉమా విమర్శించారు.

చంద్రబాబు సభను ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాల ప్రజలు విజయవంతం చేయాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్ల విజయానికి చంద్రబాబు యాత్ర నాంది పలుకుతుందని చెప్పారు. నభూతో అన్న విధంగా చంద్రబాబు సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

20 ఏళ్లుగా గుడివాడకు ‘ఇదేం కర్మ’ అని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఎవరు ఊహించని రీతిలో చంద్రబాబు సభలను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

పర్యటన వివరాలివే

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన వివరాలను మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు వెల్లడించారు. 12,13,14 తేదీల్లో చంద్రబాబు పర్యటనలు ఉంటాయని తెలిపారు. నూజివీడులో 12,13 తేదీల్లో బహిరంగ సభ, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని.. 13 మధ్యాహ్నం రోడ్ షోగా బయలుదేరి గుడివాడ రానున్నట్లు తెలిపారు. సాయంత్రం గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్‌లో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. నిమ్మకూరు హాల్ట్ నుండి గూడూరు, పెడన మీదుగా 14వ తేదీ మచిలీపట్నం రానున్నారని పేర్కొన్నారు. సాయంత్రం కోనేరు సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తెలిపారు.



Next Story

Most Viewed