Ap News: మలి దశ ఉద్యమానికి సిద్ధమవుతోన్న ఉద్యోగులు

by Disha Web Desk 16 |
Ap News: మలి దశ ఉద్యమానికి సిద్ధమవుతోన్న ఉద్యోగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. పలు దఫాలుగా ఉద్యమం చేసిన జేఏసీ తాజాగా మలిదశ ఉద్యమ కార్యచరణపై సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. విజయవాడ బందరు రోడ్డులోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావుతోపాటు ఇతరులు కలిశారు.

అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులు, ఆర్థికేతర సమస్యలపై ఫిబ్రవరి13న సీఎస్‌కి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలోని అంశాలపై నేటికీ స్పష్టత రాలేదనన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందనడానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణ ఫలితంగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వం వాడుకున్న డబ్బులు చెల్లింపులు చేసినప్పటికీ, సదరు చెల్లింపులపై స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఉద్యమం మొదలు పెట్టాక ప్రభుత్వంతో రెండుసార్లు చర్చలు జరిగినప్పటికీ, ఉద్యోగులకు చట్టప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ఆర్థిక అంశాలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అందువల్లే మలిదశ ఉద్యమకార్యచరణకు వెళ్లాల్సి వస్తుందని సీఎస్‌కు తెలియజేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఏపీలో ఉద్యోగులపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యధోరణి వల్ల ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధపడుతున్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు చెప్పారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగసంఘాల డిమాండ్లపై స్పష్టమైన హామీలతో టైమ్ షెడ్యూల్‌ను లిఖితపూర్వకంగా ఇవ్వాలని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించగలిగితేనే ఉద్యోగులు శాంత పడతారని తెలిపారు. అప్పుడే ఈ ఉద్యమానికి పరిష్కారం దొరుకుతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.



Next Story

Most Viewed