స్నేహితుడికి షాక్ ఇచ్చిన మల్లాది విష్ణు.. విజయవాడ సెంట్రల్‌లో ఆసక్తికర పోరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-01-21 10:18:21  IST  )

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది....

స్నేహితుడికి షాక్ ఇచ్చిన మల్లాది విష్ణు.. విజయవాడ సెంట్రల్‌లో ఆసక్తికర పోరు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం ఇంచార్జిగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన విజయవాడ సెంట్రల్‌లో పార్టీ బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలో ప్రజలు, నేతలు, కార్యకర్తలను కలిసేందుకు వెల్లంపల్లి పాదయాత్ర నిర్వహించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు సహకారం కోసం ఆయన కలిశారు. తన పాదయాత్రకు మద్దతు తెలపాలని కోరారు. అయితే ఇందుకు మల్లాది విష్ణు నిరాకరించారు. పాదయాత్రకు తాను రాలేనని తేల్చి చెప్పారు. దీంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే వెల్లంపల్లి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే జగన్ కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిస్థితిని వెల్లంపల్లి వివరించనున్నారు.

కాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా మల్లాడి విష్ణు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నేత బోండా ఉమపై స్వల్ప తేడాతో గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీ తరపున చాలా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ఇంటికి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. అయితే వైసీపీ అధిష్టానం చేపట్టిన సర్వేలో ఆయనపై నెగిటివ్ తేలింది. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా మాజీ మంత్రి, వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. అప్పటి నుంచి కూడా మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ సహచర మిత్రుడు అయినప్పటికీ గుర్రుగానే ఉన్నారు. ఇటీవల ఇరువురు భేటీ అయ్యారు. నియోజకవర్గంలో కలిసి పని చేస్తామని ప్రకటించారు. అయితే వెల్లంపల్లి పాదయాత్రకు మాత్రం మల్లాది విష్ణు నో చెప్పారు. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Next Story