Bejawada: అన్నసీటుపై కన్నేసిన తమ్ముడు

by Disha Web Desk 16 |
Bejawada: అన్నసీటుపై కన్నేసిన తమ్ముడు
X

దిశ,డైనమిక్ బ్యూరో: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, స్నేహితులను విడగొడతాను అంటుంది ఆ రూపాయి అని ఓ సినిమాలో డైలాగ్. అంతేకాదు నిజ జీవితంలో తరచూ ఈ సామెతలు వింటూనే ఉంటాం. ఇప్పుడు రూపాయి కాదు రాజకీయం కూడా అవే చేస్తానంటుంది. రాజకీయం రాజకీయం నువ్వేం చేస్తావు అంటే తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీబిడ్డల మధ్య చిచ్చుపెడతాను అంటుంది. ఎందుకంటున్నానంటే ఈ రాజకీయం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరు అనుకుంటున్నారా? విజయవాడ ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని. ఇద్దరు అన్నదమ్ములు. కేశినేని నాని ఎంపీగా కొనసాగుతుంటే నిన్నమెున్నటి వరకు అన్నచాటు తమ్ముడిగా రాజకీయాల్లోకి వచ్చిన సోదరుడు కేశినేని చిన్ని నేడు అన్నపైనే పోటీకి సై అంటున్నారు. అంతేకాదు అన్న నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రత్యర్థులతో చేతులు కలిపి మరీ రాజకీయం చేస్తున్నారు. దీంతో బెజవాడ రాజకీయం అన్నదమ్ముల సవాళ్లతో హీటెక్కింది.

బెజవాడలో అన్నదమ్ముల వార్

కృష్ణా జిల్లా రాజకీయాల్లో కేశినేని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వైసీపీ వేవ్‌లో కూడా గెలుపొంది టీడీపీకి గుండెకాయ లాంటి విజయవాడలో తన సత్తా చాటారు. అయితే రెండోసారి ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన స్థానిక నాయకులతో పొసగడం లేదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగులు మీరా వంటి వారు కేశినేని నానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయవాడ మేయర్‌గా కేశినేని నాని కుమార్తె శ్వేత పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయవాడలో గెలుపొందుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీడీపీ ఓటమిపాలయ్యింది. ఇందుకు బెజవాడ టీడీపీ పాలిటిక్స్‌లో వర్గపోరు అధికంగా ఉండడమే అని నిర్ధారణ అయ్యింది. అసమ్మతి నేతల వల్లే తన కుమార్తె కూర్చోవాల్సిన మేయర్ పీఠం చేజారిపోయిందని ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ కార్యాలయానికి కూడా వెళ్లడం లేదు. అంతెందుకు ఒంగోలులో జరిగిన మహానాడుకు కూడా హాజరుకాలేదు.

అన్నసీటుపై కన్నేసిన తమ్ముడు

ఇదే సమయంలో సోదరుడు కేశినేని చిన్ని దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లతో టచ్‌లోకి వెళ్లారు. ఒంగోలులో జరిగిన మహానాడు వేదికపై నానా హడావిడి చేశారు. అంతేకాదు అసమ్మతి నేతలైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగులు మీరాలతో కూడా టచ్‌లోకి వెళ్లారు. వారితో కలిసి రాజకీయం చేస్తున్నారు. ఇకపోతే బుధవారం ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక గీతం ఆవిష్కరించారు. చంద్రబాబు జీవిత ప్రస్థానంపై కేశినేని చిన్ని కథాగానం రూపొందించారు. చంద్రబాబు జీవిత చరిత్రపై అరుదైన ఫోటోలతో ఆరు నిమిషాల గీతం రూపకల్పన చేశారు. విజయవాడలో గీతాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, శావల దేవదత్, వెనిగండ్ల రాము మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. కేశినేని నానితో పొసగని నేతలతో సోదరుడు కేశినేని చిన్ని దగ్గర చేర్చుకోవడంతో ఎంపీ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది.

అధిష్టానం ఆదేశిస్తే నేను సిద్ధం

ఇదే తరుణంలో కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే టికెట్ తనకిచ్చినా, వేరే ఎవరికైనా ఇచ్చినా.. పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతామని చెప్పుకొచ్చారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటమే అజెండాగా అందరం కలిసి పని చేస్తున్నట్లు కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: Focus on Election: ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్.. తొలి అభ్యర్థి ప్రకటన

Next Story

Most Viewed