AP News: అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి.. కోనసీమ జిల్లా కలెక్టర్

by Indraja |
AP News: అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి.. కోనసీమ జిల్లా కలెక్టర్
X

దిశ వెబ్ డెస్క్: అమలాపురం/ ఆత్రేయపురం దిశ మే 19 కోనసీమ జిల్లా: ఇటీవల సుప్రీం కోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వారు జారీ చేసిన ఆదేశాల మేరకు అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.ఆదివారం స్థానిక మండల పరిధిలోని నార్కేడిమిల్లి గ్రామంలో ఇసుక ర్యాంపును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ర్యాంపుకు సంబంధించిన సరిహద్దులను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ర్యాంపులో ఎటువంటి ఇసుక ఆపరేషన్‌లు లేవని, ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో అక్రమ ఇసుక తవ్వకాలకు ఎవరు పాల్పడకుండా పోలీస్ అధికారులు పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు.

అలానే స్థానికంగా నివసించేవారు తమతమ గృహ నిర్మాణ అవసరాలకు ఇసుకను అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితులలోనూ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అక్రమ ఇసుక తవ్వకాలను నిలువరించాలని సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న దృష్ట్యా అధికారులు అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

సహజ పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు అందితే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో త్వరలో కమిటీ ఏర్పాటు చేసి ఎన్టీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు ఆపే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించనున్నదన్నారు.

ఈ కమిటీ క్రమం తప్పకుండా పర్యటించి అక్రమ తవ్వకాలు జరగకుండా పర్యవేక్షించనున్నదన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దారు వెంకట రామయ్య, జలవనరుల శాఖ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed