కన్నాకు ఇన్‌చార్జి బాధ్యతలు.. టీడీపీపై కోడెల శివరాం ఫైర్

by Disha Web Desk 21 |
కన్నాకు ఇన్‌చార్జి బాధ్యతలు.. టీడీపీపై కోడెల శివరాం ఫైర్
X

దిశ,వెబ్‌డెస్క్: సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని, తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్‌ రావు కుమారుడు కోడెల శివరాం టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన తన తండ్రి కోసం మహానాడులో ఐదు నిమిషాలు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు.

పదవులు వస్తాయంటే ఒక పార్టీ, పదవులు ఇస్తామంటే మరో పార్టీ ఇలా మూడు పార్టీలు మారిన కన్నా లక్ష్మీనారాయణకు తన తండ్రికి పోలికేంటని ప్రశ్నించారు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో రాజకీయం కోడెల వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగానే సాగిందన్నారు. అప్పట్లో ఇదే కన్నా టీడీపీ కార్యకర్తలను వేధిస్తుంటే వారికి అండగా నిలబడిన వ్యక్తి తన తండ్రి అని శివరాం ఫైర్ అయ్యారు.

తొలి నుంచి నమ్మకంగా పార్టీ కోసం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ అవమానించడం మాత్రం తప్పన్నారు. అవమానాలు, కష్టాలు తమ జీవితంలో భాగమైపోయాయన్నారు. చివరకు తన తల్లిని కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కలిసి కనీసం ఐదు నిమిషాల పాటు తమ ఇబ్బందులను వివరించాలని మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని అన్నారు.

కోడెల ఆత్మీయుల కోసం భవిష్యత్తులోనూ తాను నిలబడుతానని చెప్పారు. వారి నిర్ణయం ప్రకారమే తానూ నడుచుకుంటానని వివరించారు. ఇతర పార్టీల నుంచి ఆఫర్లు అన్న ప్రచారం కేవలం ఆపోహ మాత్రమేనని.. కానీ వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచి తన తండ్రి రుణం తీర్చుకుంటానని శివరాం ప్రకటించారు. చంద్రబాబు పిలిచి మాట్లాడుతారని ఇప్పటికీ తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు.

Also Read..

కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ పగ్గాలు.. ఇంచార్జిగా నియామకం


Next Story

Most Viewed