- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెడ్పీ ఎన్నికలపై కీలక అప్డేట్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.

దిశ, వెబ్డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజనపైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. గురువారం శాసనసభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘‘స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నాం. అలాగే రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించేటపుడు అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే దానిపై పరిశీలన జరుపుతున్నాం. పర్యావరణ ప్రేమికుడిగా ఈ విషయంలో అన్ని వైపులా ఆలోచించి పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. కేవలం చర్యలు తీసుకోవడమే కాదు.. భవిష్యత్తులోనూ చెట్లను, వృక్షాలను సంరక్షించేలా బలమైన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. ఇది కఠినంగా అమలు చేస్తేనే పచ్చదనానికి భరోసా దొరుకుతుంది.
నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్..
అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటుతున్నారు తప్పితే.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. పచ్చదనం సంరక్షణకు సభ్యుల నిశిత దృష్టిని అభినందిస్తున్నాను. అదే విధంగా ఇక మీదట అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేవాటికి, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసే ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నాం. నర్సరీల దగ్గర నుంచే దీనికి ప్రత్యేక వ్యవస్థను అమలు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తాం. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నాం. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. ఎర్ర చందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు, గోదాముల్లో ఉన్న దుంగలను అమ్మకాలను చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు ఎప్పటికప్పుడు గ్లోబల్ ధరలకు అనుగుణంగా దుంగలకు వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు మంచి ధరలు వచ్చేలా ప్రయత్నం చేస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ద్వారా ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగులకు ఇచ్చని నిష్పక్షపాత పదోన్నతులు, అటవీ శాఖ ద్వారా చేపడుతున్న పనుల గురించి సభలో మాట్లాడి, ప్రజలను చైతన్యపరిచిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి, బండారు సత్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.
బడ్జెట్ ఆమోదానికి ప్రతిపాదనలు..
2026-27 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్కు సంబంధించి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలు, బడ్జెట్ ఆమోదం కోసం గురువారం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చేశారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.11,217 కోట్లు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు రూ.713 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం ప్రతిపాదనలను సభకు సమర్పించారు.






