బీహార్ బాటలో జగన్ సర్కార్ : ఈనెల 27న కీలక నిర్ణయానికి శ్రీకారం?

by Disha Web Desk 21 |
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి నాంది పలకబోతుంది. సమగ్ర కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 27 నుంచి సమగ్ర కుల గణనకు ప్రారంభించాలని ఇప్పటికే కులగణనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా వర్గాల అభిప్రాయ సేకరణ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అభిప్రాయ సేకరణ అనంతరం ఈనెల 27 నుంచి సమగ్ర కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమగ్ర కుల గణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లుత తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్‌ను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ కుల గణను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

6నెలలే టార్గెట్

కుల గణనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కులగణన అమల్లో ఉంది. బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా డేటాను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కుల గణనపై సమాచారాన్ని సేకరించేందుకు సర్వేలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహకాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం సమగ్ర కుల గణనకు రంగం సిద్ధం చేస్తోంది. సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అడుగుల వేస్తోంది. సమాజంలో అణగారిన వర్గాల వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందించేందుకు వీలుగా ఈ సమగ్ర కుల గణన ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. దాదాపు శతాబ్ధం అనంతరం వైసీపీ ప్రభుత్వం ఈ సమగ్ర కుల గణనకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ సమగ్ర కుల గణన ద్వారా రాష్ట్రంలో మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు రూపుమాపేలా ప్రణాళికలు రూపొందించ వచ్చు అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే నవంబర్ 27 నుంచి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ఆరు నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా విజయవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

రీ వెరీఫికేషన్ సైతం

సమగ్ర కుల గణన అంశానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రాంతీయ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఈనెల 15,16 తేదీలలో జిల్లా స్థాయిలో 17 నుంచి 24 వరకు ప్రాంతీయ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతి వేదికగా ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు తెలుస్తోందని సమాచారం. ఈ సన్నాహక సమావేశాల అనంతరం సచివాలయాల ఉద్యోగులు ఈ కుల గణన ప్రక్రియ చేపడతారని తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటిని సందర్శించి, సమాచారాన్ని సేకరిస్తారని తర్వాత ఈ సమాచారంపై రీ వెరిఫికేషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రతీ సచివాలయ పరిధిలో కనీసం 10శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ ఉంటుందని ఇందుకు ఒక ప్రత్యేక అధికారిని సైతం ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed