కడప స్టీల్ ప్లాంట్ పనులు త్వరగా ప్రారంభించాలి : మంత్రి లోకేశ్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-21 09:14:52  IST  )

యువతకు ఉపాధి లభిస్తుంది. రాయలసీమ అభివృద్ధి చెందుతుంది.

కడప స్టీల్ ప్లాంట్ పనులు త్వరగా ప్రారంభించాలి : మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : జెఎస్ డబ్ల్యూ గ్రూప్ (JSW Group) మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ (Parth Jindal) తో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ భేటీలో భాగంగా కడపలో ఏర్పాటు చేయబోయే భారీ స్టీల్ ప్లాంట్ పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ షెడ్యూల్ ను ఖరారు చేయాలని కోరారు. రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉందని.. ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని పార్థ్ జిందాల్ ను కోరారు. ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులను ఇవ్వడంతో పాటు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తుందని భరోసానిచ్చారు.

రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తలపెట్టిన బ్యాటరీ తయారీ యూనిట్ అంశాన్ని కూడా మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు. ఈ యూనిట్ ఏర్పాటు కోసం పరిశ్రమల హబ్‌గా ఉన్న శ్రీసిటీ, వ్యూహాత్మక ప్రాంతమైన విశాఖపట్నాన్ని పరిశీలించాలని మంత్రి ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని వివరించారు. దీనిపై పార్థ్ జిందాల్ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను తమ బృందం లోతుగా అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీ ద్వారా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మరిన్ని కొత్త దారులు సుగమం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More..

ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో సీఎం ఫలవంతమైన చర్చలు

ఏపీలో భారీగా RMZ గ్రూప్ పెట్టుబడులు.. విశాఖలో GCC పార్కు ఏర్పాటుకు ఒప్పందం

Next Story