దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డుగా జువ్వలదిన్నె : మంత్రి అనగాని

by Naga Rani Yarlagadda |

జువ్వలదిన్నె ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డు కానుంది.

దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డుగా జువ్వలదిన్నె : మంత్రి అనగాని
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డుగా అవతరించబోతోందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

రూ.288.80 కోట్ల పెట్టుబడి.. యువతకు భారీగా ఉద్యోగాలు

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం రూ.288.80 కోట్ల భారీ పెట్టుబడితో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసిందని మంత్రి అనగాని వెల్లడించారు. ఈ కేంద్రాన్ని ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) హబ్‌గా తీర్చిదిద్దడం వల్ల, సాంకేతిక, పరిశోధన రంగాల్లో ఆసక్తి ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. మారిటైం రోబోటిక్స్ రంగంలో ఏపీకి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని మంత్రి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఒక్క హార్బర్‌ను కానీ, పోర్టును కానీ పూర్తి చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్, జువ్వలదిన్నె ప్రాజెక్టుపై అనవసరంగా విషం కక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. మత్స్యకారుల ప్రయోజనాలను గాలికొదిలేసిన గత ప్రభుత్వం, ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతోందని విమర్శించారు.

Next Story