ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ ఊరట

by Disha Web Desk 21 |
cm ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సామాజిక పెన్షన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనపై సమీక్షిచేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిల్‌పై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అనంతరం పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలతోపాటు దీర్ఘకాళిక సమస్యలతో బాధపడుతున్న వారికి సైతం ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే కుటుంబంలో ఎంతమంది పెన్షన్ లబ్దిదారులున్నా ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 2019 డిసెంబర్‌లో కొత్త నిబంధనను తీసుకువస్తూ జీవో నంబర్ 174 జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలతో ఒకే కుటుంబంలో ఉన్న వేర్వేరు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు రాకుండా నిలిచిపోయాయి. ఈ అంశంపై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లు పొందే అర్హత ఉన్నప్పటికీ ఒకే కుటుంబంలో ఉన్నారన్న కారణంతో వీరికి ప్రయోజనం నిరాకరించడం సరికాదని పిటిషనర్ వాజ్యంలో అభ్యంతరం తెలియజేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ అంశం ఆర్దికపరమైన, విధానపరమైన అంశాలతో కూడినదని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వ విచక్షణకే వదిలిపెడుతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పెన్షన్ లబ్దిదారుల ఎంపిక పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల ఆధారంగానే ఉంటుందని తేల్చిచెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించినట్లైంది.

Next Story

Most Viewed