జగన్ పనులు చూస్తుంటే చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్టుంది: అనిత

by Disha Web Desk 12 |
జగన్ పనులు చూస్తుంటే చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్టుంది: అనిత
X

దిశ, డైనమిక్ బ్యూరో : కమీషన్ల కోసమే జగన్ ఇన్నేళ్లు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఊసెత్తలేదు అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణను, నిర్మాణాన్ని తప్పుపట్టి, చంద్రబాబుని నిందించిన జగన్, ఇప్పుడు మరలా శంకుస్థాపన ఎందుకు చేశాడు? అని నిలదీశారు. ఎవరి బినామీ భూములున్నాయని 3 ఏళ్లలో నిర్మిస్తానంటున్నాడు? అని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వంగలపూడి అనిత గురువారం మీడియాతో మాట్లాడారు. 2019లో ఫిబ్రవరిలో అన్ని అనుమతులతో చంద్రబాబు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే, ప్రతిపక్ష నేత హోదాలో జగన్ నానా యాగీ చేశాడు అని చెప్పుకొచ్చారు.

రైతుల భూములు లాక్కున్నారని, విశాఖ విమానాశ్రయం పక్కన ఉన్న భూములు ఎందుకు తీసుకోలేదని, జీ.ఎం.ఆర్ కంపెనీకి చంద్రబాబు మేలుచేస్తున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడాడు అని గుర్తు చేశారు. భోగాపురం విమానాశ్రయం నిర్మించేచోట అయ్యన్నపాత్రుడు, అవంతి, గంటా శ్రీనివాసరావుకు భూములున్నాయని కూడా ఆరోపించాడన్నారు. అన్ని నిందలేసిన జగన్.. మరలా ఇప్పుడు అదే భూముల్లో రెండోసారి శంకుస్థాపన ఎందుకు చేశాడు? జగన్ మాటలు, చేష్టలు, చర్యలు చూస్తే ఆయనకు మతిభ్రమించిందేమో అనిపిస్తూ ఉంటుంది అని ఘాటు విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి పనులు చూస్తుంటే చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్టున్నాయని, చంద్రబాబు గారు శంఖుస్థాపనలు చేసిన వాటికి మరలా చేయడం, చంద్రబాబు కట్టించిన భవనాలకు రంగులేయించడమే అందుకు నిదర్శనమని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగ లపూడి అనిత ఎద్దేవా చేశారు. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు శంకుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి నిన్న జగన్ మరలా శంకుస్థాపన చేస్తూ, వంగలేక నిలబడే ఇనుప చువ్వలపై కొబ్బరికాయ కొట్టాడు. భోగాపురం విమానాశ్రయం మణిహారమనే విషయం జగన్ కు గతంలో తెలియదా? అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిల దీశారు.

Next Story

Most Viewed