జగన్ ఎఫెక్ట్: భిక్షాటన చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

by Disha Web Desk 21 |
జగన్ ఎఫెక్ట్: భిక్షాటన చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : జేసీ బ్రదర్స్ అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయంలో వీరి ప్రస్తావన తప్పనిసరి. కాంగ్రెస్ హయాంలో జేసీ బ్రదర్స్ ఓ వెలుగు వెలుగొందారు. ఇంకా చెప్పాలంటే అనంతపురం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో ఏలారు. అలాంటి జేసీ బ్రదర్స్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా సతమతమవుతున్నారు. ఒకప్పుడు ఏం మాట్లాడినా సంచలనంగా ఉండే జేసీ బ్రదర్స్ ఇప్పుడు వినూత్న రీతిలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపైనా ముఖ్యంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా ధ్వజమెత్తుతూనే ఉన్నారు. అయితే తాజాగా వినూత్న రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై తన నిరసనను తెలిపారు. తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతుల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేశారు. తాడిపత్రి పట్టణంలో ఓ రూపాయి ఉంటే వేయండయ్యా అంటూ భిక్షాటన చేశారు.

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటుందని ఈ నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే అభివృద్ధి చేసుకోవాలంటూ భిక్షాటన చేశారు. తాడిపత్రిలోని గాంధీ విగ్రహం నుంచి కొత్త కూరగాయల మార్కెట్‌ వరకూ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేశారు. వైఎస్ జగన్, కేతిరెడ్డి పెద్దారెడ్డిల ఎఫెక్ట్‌తో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.తాను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ కావడంతో ఈ మున్సిపాలిటీపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ప్రతీ అభివృద్ధి పనికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థలోని ఎస్‌టీపీ-1 మరమ్మతుల కోసం తొలుత రూ.30 లక్షలు, రెండో విడత రూ.15 లక్షలు నిధులు విడుదల చేసినా ఇప్పటికీ పనులు నత్తనడకన కొనసాగడంపై విమర్శలు చేశారు. తాడిపత్రి ప్రజల అభివృద్ధిని అడ్డుకునేవారు ఎంతటివారైనా నరుకుతా.. ఉతికి ఆరేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.



Next Story

Most Viewed