తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ నారాయణన్

by Thanuru Gopichand |

ఓం నమో వెంకటేశాయ.

తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ నారాయణన్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక మైలురాయికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, సంస్థ చైర్మన్ వి.నారాయణన్ శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి చేపట్టనున్న పీఎస్ఎల్వీ సీ62 (PSLV-C62) రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందంతో కలిసి వచ్చిన ఆయన, ప్రయోగించబోయే ఉపగ్రహ నమూనాను (Satellite Model) శ్రీవారి పాదాల చెంత ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు.

​దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు ఇస్రో చైర్మన్‌కు వేదాశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి గౌరవించారు. అనంతరం నారాయణన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా EOS-N1 (Anvesha) అనే భూపరిశీలన ఉపగ్రహంతో పాటు మరికొన్ని విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇది 2026 సంవత్సరంలో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమని, దేశ భద్రత, శాస్త్రీయ రంగంలో ఇది ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఏటా కీలక ప్రయోగాలకు ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం ఇస్రోలో ఒక సంప్రదాయంగా వస్తోందని ఆయన గుర్తుచేశారు.

Next Story