Andhra pradesh లో 175కి 175 సాధ్యమేనా...!

by Disha Web Desk 16 |
Andhra pradesh లో 175కి 175 సాధ్యమేనా...!
X

దిశ, అన్నవరం : వైఎస్సార్సీపీలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి లక్ష్యంగా పెట్టుకుంటే అసమ్మతి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇప్పటికే 2 టిక్కెట్లు చేజారిపోగా అసెంబ్లీ ఎన్నికల నాటికి 175 స్థానాల్లో సీట్లు ప్రకటించినప్పటికి మరెన్నీ రాలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్నామని కోట్లాది రూపాయాలు సంక్షేమ పథకాల పేరిట బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకే పంపిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా నేటికీ కార్యకర్త నుంచి నాయకుడి వరకూ వారి స్థాయిల్లో ఏ పనులూ జరగడం లేదు. ఆ విషయం అధిష్టానం వరకూ వెళ్లడం లేదనే ప్రచారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అయింది.

కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవులు ఇంకా చాలా స్థాయిలో భర్తీ కాలేదనేది జగమెరిగిన సత్యం. ఈ తరుణంలో అసమ్మతి ఎమ్మెల్యేలు, సీటు చేజారిపోతుందని భావించే ఎమ్మెల్యేలు, సీటు కోసం ఆశించేవారు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. తాను ఒకటి తలిస్తే పార్టీ ఒకటి తలచినట్టుగా పార్టీ అధికారంలో లేనపుడు జెండాలు మోసిన కార్యకర్తలు, వారిని దగ్గరుండి నడిపించిన నాయకులకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం జరగలేదనేది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు ఈ విషయం తెలిసినా తమను కార్యకర్తలుగానే ఉంచేస్తున్నారనే కొందరి నేతలు, కార్యక్తల్లో ఆవేదన ఉంది. అధికారంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు ఆశ, ఆలోచన ఉండటం సహజమే. కానీ సొంత గ్రామంలో కనీసం చిన్న చిన్న పనులు కూడా ప్రజలకు, కార్యకర్తలకు చేయించలేని నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తారా? అంటే కష్టమేననే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బెదిరించి పని చేయించాలని డబ్బుతో ఓటును కొనాలనుకునే రోజులు పోయాయనే విషయం 2019 ఎన్నికల్లోనే తేటతెల్లం అయ్యింది. ఇపుడు ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే తప్పా వచ్చే ఎన్నికల్లో ఓటు పడే పరిస్థితి లేదనేది ప్రస్తుత వాస్తవం. అయినా కొంత మంది ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా..ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంపీలుగా వెళ్లడానికి, నియోజకవర్గాలు మార్పుకి పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో దిగువస్థాయి కేడర్, సీటు ఆశించిన వారంతా అలకపూనారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు జారిపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

అటు ప్రతిపక్షపార్టీలు, వామపక్షపార్టీలు కూడా ఎక్కడా తగ్గడంలేదు. వారి వారి బలాన్ని పెంచుకుంటూనే ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాలలో చైతన్యం తీసుకువస్తున్నారు. ఈసారి ఏదిఏమైనా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేసే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదువుపుతున్నారని విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. ప్రభుత్వం 175కి 175గా లక్ష్యం పెట్టుకుందని అయితే 75 మాత్రమే అధికారపార్టీకి ఇచ్చి మిగిలిన 100 తాము సంపాదించే దిశగా ప్రజల్లోకి వెళుతున్నారనేది ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ప్రజలతో నమ్మకంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రతిపక్షాలను, వామపక్షాలను నమ్మే పరిస్థితిని తీసుకువస్తున్నారు. ప్రభుత్వం నగదు బదిలీ పథకాల రూపంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నా ఇచ్చిన దానికంటే ఎంతరెట్టింపు ప్రజలపై పన్నులు, విద్యుత్, గ్యాస్, ఇతరత్రా భారాలను మోపుతుందనేది ప్రజలకు తెలియజేయడంలో ముందుంటున్నారు. అదే సమయంలో అధికారపార్టీలో అసమ్మతి సెగను కూడా చక్కగా వినియోగించుకుంటున్నారే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వ లక్ష్యం 175కి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై ఆశక్తికర రాజకీయ చర్చ ఆంధ్రప్రదే‌‌లో జరుగుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

Ap News: టీడీపీ నేతలతో పనేంటి..?.. కోటంరెడ్డిపై పేర్ని నాని ఆగ్రహం


Next Story

Most Viewed