నన్ను కెలికితే ఈ భూమ్మీద మిగలరు: టీడీపీకి జేసీ బ్రదర్స్‌ న్యాయవాది వార్నింగ్

by Disha Web Desk 21 |
jc prabhakar reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేసీ బ్రదర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల వ్యక్తిగత న్యాయవాది, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడారు. వైసీపీలో చేరానని తనను టీడీపీ నాయకులు కెలికితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే ఏ ఒక్కరు కూడా ఈ భూమ్మీద మిగలరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో విసుగు చెంది తాను వైసీపీలో చేరినట్లు వివరించారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను అడ్డుకోవడం, అధికార పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి చేస్తుండటంతో తట్టుకోలేకే తాను వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారారని ఆరోపించారు. తాడిపత్రి ప్రజలకు నిత్యం తాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా రూ. 63 కోట్లు తీసుకొస్తే కౌన్సిల్‌లో అమోదించకుండా అడ్డుకుంటుున్నారని మండిపడ్డారు. అంతేకాదు టెండర్లను సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.



Next Story