అప్పుల్లో 58% రెవెన్యూలో 42శాతమా? ఇలా అయితే రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుంది?: సీఎం వైఎస్ జగన్

by Seetharam |   ( Updated:2023-11-20 13:56:25.0  )
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ‘అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు. కానీ రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి’ అని ప్రశ్నించారు. ఈనెల 21న రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పలువురు అధికారులు హాజరుకానున్నారు. ఆ సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు కూడా రాలేదు. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి’ అని సీఎం వైఎస్ జగన్ సూచించారు.

ఏపీ పట్ల ప్రత్యేకత చూపించాల్సిందే

విభజన వల్ల హైదరాబాద్‌ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది. ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి. తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రెవిన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం పురోగమిస్తేనే దేశంకూడా పురోగమిస్తుంది’ అని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది. అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం’ అని సీఎం వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీపై ఒత్తిడి పెంచాలి

‘రాష్ట్రానికి కొత్తగా సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీని ఇవ్వాలి. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. కడపలో స్టీల్‌ప్లాంట్‌‌కు సమీప ప్రాంతంలో ఎన్‌ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి’అని సీఎం వైఎస్ జగన్ కోరారు. ‘విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్టీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం – వయా కర్నూలు మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

విశాఖ రైల్వే జోన్‌పై దృష్టి పెట్టాలి

విశాఖ రైల్వే జోన్‌అంశంపై కూడా దృష్టిపెట్టాలి అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.‘ వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు. విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్‌ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌ పోర్టును నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్‌ పోర్టుకు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. విశాఖ సిటీనుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భోగాపురం ఎయిర్‌ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్‌ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలి. ప్రైవేట్‌ డెవలపర్‌ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది. దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి అని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed