AP: ఐఏఎస్‌ అధికారి రాజీనామా.. నేడు ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు..!

by Disha Web Desk 3 |
AP: ఐఏఎస్‌ అధికారి రాజీనామా.. నేడు ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు..!
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లుగా ప్రతినిధ్యం వహించిన ఐఏఎస్ లు ఇకపై రాజకీయాల్లో తమ ప్రతిభను చూపనున్నారు. ఇప్పటికే ఐఏఎస్ విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి పీపుల్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. అయితే తాజాగా మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ కూడా రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిన్న (బుధవారం) ఉదయం తాను తన పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేస్తున్నట్లు దరఖాస్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన లేఖను నిన్న మధ్యాహ్నం ప్రభుత్వం అంగీకరించగా.. నిన్న సాయంత్రం వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తున్నట్టు ఉత్తర్వులు (జీవో-477)ను జారీ చేసింది. అయితే ఇంతియాజ్‌ ఇంత వేగంగా స్వచ్చందగా పదవికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం.. ఆయన నిర్ణయాన్ని గౌరవించి శరవేగంగా ఆయన అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించడం క్షణాల్లో జరిగింది.

దీనితో ఇంతియాజ్‌ వైసీపీలో చేరుతున్నారనే వార్త వాస్తవం అని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన ఈ రోజే వైసీపీ గూటికి చేరుకుంటారని సమాచారం. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీచేయబోతున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఏఎండీ ఇంతియాజ్‌ డిపూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు.

అనంతరం 2018కి ముందు నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఇక 2019, ఫిబ్రవరి 8న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందారు. అక్కడే 2021, జూన్‌ వరకు ఆ పోస్టులో కొనసాగారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ఇంతియాజ్‌ ను ఆ పదవి నుండి తప్పించి మైనారిటీ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించారు. ఆతరువాత మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్‌, ఆ శాఖ స్పెషల్‌ సెక్రెటరీగా రెండు బాధ్యతల్లో ఉన్న ఇంతియాజ్‌కు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవిని కూడా అప్పగించడం జరిగింది.


Next Story

Most Viewed