చెప్పిన పని చేశాకే ఓట్లు అడుగుతా!.. మంత్రి గుడివాడ అమర్నాథ్

by Disha Web Desk 7 |
చెప్పిన పని చేశాకే ఓట్లు అడుగుతా!.. మంత్రి గుడివాడ అమర్నాథ్
X

దిశ, అనకాపల్లి: "చెప్పిన పని చేశాకే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను. పని చేయకపోతే మీరు నాకు ఓటేయకండి.." అని అనకాపల్లి మండలం మూలపేట గ్రామస్తులతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న మాటలు ఇవి. ఈ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ గడపగడపకు వెళ్లే సమయంలో ఒక వీధిలో తాము చాలాకాలంగా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వంలో తాము చాలాసార్లు ప్రజా ప్రతినిధులకు చెప్పామని, అయినా ఇప్పటికీ తాము రోడ్లకు నోచుకోలేకపోతున్నామని వారు వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి అమర్నాథ్ ఈ ప్రాంతానికి తాను రోడ్లు వేయిస్తానని, రోడ్లు వేసిన తరువాతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని, ఒకవేళ రోడ్లు వేయలేకపోతే తాను ఓట్లు అడగనని చెప్పారు. ఆయన మాటలు విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. గ్రామాలలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే తాను చర్యలు తీసుకుంటున్నానని అమర్నాథ్ చెప్పారు. 'అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించలేను కదా?' దశలవారీగా సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని అమర్నాథ్ చెప్పారు. ఈ గ్రామంలో 20 లక్షల రూపాయలతో తక్షణం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని, మరొక పది లక్షల రూపాయలతో కాలువల నిర్మాణాలు చేపట్టాలని మంత్రి అమర్నాథ్ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.

జలజీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికి మంచినీటి కొళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే శారద నగర్ బ్రిడ్జి నుంచి సత్యనారాయణపురం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా మూలపేటకు రోడ్డు కావాలని స్థానికులు మంత్రి అమర్నాధుని కోరగా త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే గంగాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని వారు కోరారు. గ్రామంలో లబ్ధిదారులకు పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి ఇంకా పథకాలు అందని వారిని గుర్తించి పథకాలు అందేలా చూడాలని మంత్రి అమర్నాథ్ అధికారులకు సూచించారు. గ్రామంలో కొండల మీద నివసిస్తున్న వారి ఇళ్లకు కూడా మంత్రి నడిచి వెళ్లి వారికి మంజూరైన పథకాలకు సంబంధించిన బ్రోచర్లను అందజేశారు.

అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గ్రామ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, గ్రామస్తుల మొర వినలేదని దీని ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పేరుకు పోయాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులకు వెనకాడకుండా అభివృద్ధే మంత్రంగా ఒక్కో పనిని చేసుకో వస్తున్నామని, ఈ మార్పును ప్రజలు గుర్తించాలని కోరారు. పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందని ఆయన చెప్పారు. గతంలో ఏ మంత్రి అయినా ఇలా గ్రామాలకు వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. అభివృద్ధి చేసి చూపిస్తున్నాo కనుకే ప్రజా ప్రతినిధులమంతా ధైర్యంగా గడపగడపకు రాగలుగుతున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ గ్రామంలోని వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సందర్శించారు.



Next Story

Most Viewed