ఎంత దారుణం.. ప్రమాదంలో మూగజీవాల మరణం

by Thanuru Gopichand |

ప్రశ్నార్థకంగా మారుతున్న రహదారి భద్రత.

ఎంత దారుణం.. ప్రమాదంలో మూగజీవాల మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని (Andhra Pradesh) రహదారులు బలిని కోరుకుంటున్నాయేమో అనిపిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో రహదారులు రక్తంతో తడుస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు రోడ్డు ప్రమాదం (Road Accident) కారణంగా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కారు యాక్సిడెంట్లు, బైకు యాక్సిడెంట్లు, ప్రైవేటు, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లు, భారీ వాహనాల కారణంగా యాక్సిడెంట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో రహదారులపై ప్రయాణించాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కొందరు మరణిస్తుండగా, మరికొందరు క్షతగాత్రులై అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వ్యక్తులతో పాటు మూగజీవాలు కూడా ప్రమాదాలబారిన పడుతున్నాయి. మనుషుల నిర్లక్ష్యం వాటి ప్రాణాల మీదకు తెస్తోంది. వాటికి నోరు లేకపోవడం వల్ల బాధను చెప్పుకోలేవు. వాటి గురించి మాట్లాడేవారు ఉండరు. అదే పెంపుడు జంతువులైతే యజమానులు గొంతు విప్పుతారు. ఈ క్రమంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు రవాణ వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నాయి.

మూగజీవాలు కూడా రోడ్డు ప్రమాదాలకు అతీతం కాదని నిరూపించే సంఘటన ఒకటి అనకాపల్లి జిల్లా (Anakapalli) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పాయకరావుపేట మండలం నామవరం (Namavaram) వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 20 వరకు గొర్రెలు మృతి (Sheeps Accident) చెందాయి. మరో 20కి పైగా గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. నామవరం నుంచి పాయకరావుపేట వైపు గొర్రెల మందను తోలుకెళ్తుండగా ఓ నాలుగు చక్రాల వాహనం వాటిని ఢీకొట్టింది. అనంతరం అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో గొర్రెల కాపరులకు నష్టం వాటిల్లడమే కాకుండా మూగ జీవాలు సైతం తమ ప్రాణం కోల్పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమకు తగిన నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు.

Next Story